ఇప్పటికే దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా పేరొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది.
రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను సైతం ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటుచేశారని తెలిపింది.
యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019–22 మధ్య కాలంలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ఆశచూపాడని ఈడీ ఆరోపించింది. సాక్షులను విచారించిన తర్వాతే రేవంత్ రెడ్డి పేరును అభియోగపత్రంలో చేర్చామని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు విచారణలో తెలిపారని ఈడీ వివరించింది.