కాపాడుకోవాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సూచన
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 9వ శతాబ్దం నాటి 15 జైన గుహల సముదాయాలను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శనివారం (2025 మే 31న) సందర్శించారు. ఈ గుహలు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. 2 నుంచి 6 మీటర్ల పొడవు, 2 నుంచి 3 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. తూర్పు వైపు ద్వారంతో నేలపై రాతి పడకలు కలిగి ఉన్నాయి. వర్షా కాలంలో జైన మునులు ఈ గుహల్లో నివసించేవారు. మరణించేంత వరకు
ఆహారం తీసుకోకుండా ఈ పడకల పైనే సల్లేఖన వ్రతాన్ని ఆచరించేవారు.

ఒక గుహలో పద్మాసనంలో ఉన్న జైన తీర్ధంకరుడి విగ్రహాన్ని పరిశీలించి ఈ గుహలు క్రీస్తు శకం 9 వ శతాబ్ద (రాష్ట్రకూటుల) కాలానికి చెందినవని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కల 1100 ఏళ్ల నాటి ఈ జైన గుహలను కాపాడాలని ఆలయ, వికారాబాద్ పురపాలక సంఘ అధికారులకు సూచించారు. వాటిని కాపాడటానికి ఆలయ చైర్మన్ డాక్టర్ పద్మనాభం సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కట్టడాల కార్యకర్తలు డీఆర్ శ్యామ్ సుందర్ రావు, బి.వెంకటరెడ్డి, బి.సాయి కిరణ్ రెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.