ఏటీఎమ్లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్లలో ఆ డినామినేషన్ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఏప్రిల్లో ఆదేశించింది. ఈ ఆదేశాలను దశల వారీగా అమలుచేయాలని అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎమ్ ఆపరేటర్లకు సూచించింది. సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎమ్లలో కనీసం ఒక్క క్యాసెట్లోనైనా రూ.100 నోట్లు గానీ రూ.200 నోట్లు గానీ ఉండేలా చూడాలని గడువు విధించింది.
ఈ పర్సంటేజ్ను 2026 మార్చి 31 నాటికి 90 శాతానికి చేర్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 70 శాతానికి పైగా పెంచటం గమనార్హం. 2024 డిసెంబర్లో 65 శాతంగా ఉన్న ఈ లభ్యత ఇప్పుడు 73 శాతంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ కంపెనీ.. దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎమ్లలో 73,000 ఏటీఎమ్లను మెయిన్టెయిన్ చేస్తుండటం విశేషం.