రాజస్థాన్ సీఐడీ (సెక్యూరిటీ) ఇంటెలిజెన్స్ పోలీసులు, భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసిన ఆరోపణలపై మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జైసల్మేర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్లో కాంట్రాక్టు మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్, ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా పల్యున్ గ్రామానికి చెందినవాడు. సీఐడీ ఐజీ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపిన ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిఘాను కట్టుదిట్టం చేసిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హ్యాండ్లర్తో నిరంతర సంబంధాలు కొనసాగించాడని దర్యాప్తులో తేలింది.
చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ క్షిపణులు, ఆయుధాల పరీక్షలకు సైన్యం, డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తరచుగా వెళ్లే వ్యూహాత్మక ప్రదేశం. ఈ గెస్ట్ హౌస్కు వచ్చే సైనికాధికారులు, శాస్త్రవేత్తల కదలికలు, వారి పర్యటన వివరాలను మహేంద్ర తన పాకిస్థానీ హ్యాండ్లర్కు అందించినట్లు అధికారులు నిర్ధారించారు. భద్రతా ఏజెన్సీలు అతని మొబైల్ను సాంకేతికంగా విశ్లేషించగా, డీఆర్డీఓ కార్యకలాపాలు మరియు భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఈ ఆధారాల ఆధారంగా మంగళవారం అతడిని అధికారికంగా గూఢచర్యం కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ఈ నెట్వర్క్లో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలను వెంటనే నివేదించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.