- నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు
- ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్.. !
- విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..
- ఒక ప్రత్యేక చట్టం ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వీరికి ఏర్పాటు చేసిందా..?
- మే 27 న దరఖాస్తు చేసుకుంటే.. మే 28 న అనుమతులు..
- 24 గంటల్లో అన్నీ తనిఖీలు జరిగిపోయాయా.. ?
- ఏపీలో మంత్రిగా పనిచేస్తూ.. తెలంగాణాలో చక్రం తిప్పుతున్నాడా..?
- గురువు గారి కోటరీలో మంత్రిగా వున్నందుకు.. ఇక్కడ శిష్యుడు ఋణం తీర్చుకుంటున్నాడా..?
- ప్రభుత్వ విద్యాసంస్థలకు గ్రహణం పట్టింది..
- కార్పొరేట్ విద్యాసంస్థలకు మహర్దశ పట్టింది..
- సర్వే నెంబర్ : 19 పార్ట్ వెలిమల గ్రామంలో వెలుగు చూసిన ఘటన..
- పర్మిషన్ స్టిల్ట్ ప్లస్ టు అంటున్నారు.. మరి కట్టింది 5 అంతస్తులు..!

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారుగొప్పోళ్ళు కాలేదా..? ప్రభుత్వ స్కూళ్లల్లో స్టాండర్డ్స్ ఉండవా..? ఖచ్చితంగా ఉంటాయి.. కానీ కొన్ని దుష్ట శక్తులు ప్రభుత్వ విద్యాలయాలను నీరుగార్చేశారు.. ప్రభుత్వ బళ్ళు అంటే ఒక రకమైన నిర్వేదం ఏర్పడేలా ప్లాన్ చేశారు.. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి.. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లను మెయింటైన్ చేయడం వల్ల ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి లాభం ఉండదు.. అక్రమ సంపాదనకు ఎలాంటి ఛాన్స్ ఉండదు.. అదే కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తే కమిషన్ల రూపాన సంపాదించుకోవచ్చు.. అందుకే కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు.. దిగ్విజయంగా నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లను, గురుకులాలను నిస్సిగ్గుగా మూసేస్తున్నారు.. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లి దండ్రుల రక్తం పీలుస్తున్న నారాయణ విద్యా సంస్థకు తెలంగాణా ప్రభుత్వం వంగి వంగి దండాలు పెడుతోంది.. ఇదేమని అడిగేవాళ్లను కేసుల పేరుతో చిత్ర హింసలు పెడుతోంది.. అసలు జరిగిన తంతు ఒకసారి చూద్దాం..
సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 19/పార్ట్ లో వెలిమెల క్యాంపస్ నారాయణ హైస్కూల్ వారు ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు.. దీనికి గాను గ్రామ పంచాయితీ నుంచి స్టిల్ట్ ప్లస్ టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని చెబుతూ ఏకంగా 5 అంతస్తుల బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు.. కాగా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆ స్కూల్ ని సీజ్ చేశారు.. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ అధికారుల అనుమతి లేకుండా స్కూల్ యాజమాన్యం సీజ్ చేసిన పాఠశాలను తెరిచారు..

ఈ తంతు జరిగిన తరువాత మరో సారి ఈ స్కూల్ వ్యవాహారంపై సంగారెడ్డి డీఈఓకు ఫిర్యాదు చేశారు ఓ సామాజికవేత్త.. దీని తరువాత.. డీఈఓ ఎంక్వయిరీ చేసి.. స్కూల్ ని సీజ్ చెయ్యమని ఎం.ఈ.ఓ.కు ఆదేశాలు ఇచ్చారు.. ఇక రెండవసారి కూడా సంబంధించిన ఉత్తర్వు కాపీని స్కూల్ వారికి అందించడం జరిగింది.. ప్రీప్రైమరీ నుండి 8వ తరగతి వరకు తమ స్కూల్కు అనుమతులు ఇవ్వమంటూ స్కూలు వారు స్కూల్ రీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ కావాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది.. 27 మే నెల 2025 నాడు దరఖాస్తు చేసుకుంటే కేవలం 24 గంటల్లోనే అంటే 28 మే నెల 2025 నాడు స్కూల్ తిరిగి తెరుచుకోవచ్చు అంటూ అనుమతులు మంజూరు అయ్యాయి.. ఇదెలా సాధ్యం అంటున్నారు విశ్లేషకులు..

రెండుసార్లు మూతపడి సీజ్ అయిన స్కూల్ దర్జాగా తెరవబడిరది ఆంటే దీని వెనుక ఎంత మతలబు జరిగి ఉంటుందో ఆలోచించవచ్చు.. మంత్రి గారా మజాకా.. ఏదైనా సాధ్యం అవుతుంది.. అయితే ఒకసారి సీజ్ అయిన ఒక స్కూల్కి రీ ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఎన్నెన్నో నిబంధనలు, ఎన్నెన్నో ఎంక్వయిరీలు ఉంటాయి.. ఇదంతా కేవలం ఒక్క రోజులో సాధ్యం కాదు.. అసలు ఆ స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్ ఉందా..? ఫైర్ సేఫ్టీ నిబంధన కరెక్ట్ గా పాటిస్తు న్నారా..? ఫైర్ సర్వీసెస్ వారు అనుమతులు ఇచ్చారా..? పోలీస్ ఎంక్వయిరీ చేశారా..? ఇలాంటివి అన్నీ ప్రాపర్ గా జరగాలి.. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే కనీసం నెల సమయం అయినా పడుతుంది.. మరి ఏమి మాయ జరిగిందో తెలియదు.. నారాయణ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ స్కూలు బిల్డింగ్స్ కి కేవలం ఒక్కరోజులోనే అనుమతులు వచ్చాయి..

మరి ఈ 24 గంటల్లో ఇన్ని డిపార్ట్ మెంట్స్కి సంబంధించిన అధికారులు ఒకేసారి ఒకే రోజు వచ్చి పరిశీలించారా..? ఇదెలా సాధ్యం అయ్యింది..? ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చిన్న పని కావాలంటే సవాలక్ష కారణాలు చూపి కొర్రులు పెడుతుంటారు.. దరఖాస్తు దారులను ముప్పు తిప్పలు పెడతారు.. ఇదంతా సామాన్యులకు ఎదురయ్యే సమస్యలు.. కానీ ఇక్కడ దరఖాస్తు చేసుకున్నది ఒక మంత్రి గారికి సంబంధించిన విద్యా సంస్థ.. వీరికి క్షణాల్లో అన్నీ జరిగిపోతాయి.. పైగా మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగులకు పర్మిషన్ ఉన్నది గ్రామ పంచాయితీ నుంచి.. అదికూడా స్టిల్ట్ ప్లస్ టు కు మాత్రమే.. కానీ నిర్మాణం జరుగు తున్నది మాత్రం ఐదు అంతస్తులు.. ఇదెలా సాధ్యం అయ్యింది..

అందుకే ఒక సామెత చెబుతుంటారు పెద్దలు వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పదార్ధాలన్నీ విస్తర్లోకి వచ్చి చేరతాయి అని.. ఇది అక్షరాలా నారాయణ విషయంలో జరుగుతోంది.. నిజానికి వీరు కడుతున్నది నాలుగైదు బ్లాకులు అని తెలుస్తోంది.. ఇది మరీ దారుణం.. అయితే ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని, పోలీస్ ఎంక్వయిరీ గానీ, అధికారుల ఎంక్వయిరీ గానీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ గానీ జరగలేదని స్థానికులు చెబుతున్న మాట.. మరి పసిమొగ్గలు చదువుతున్న ఈ విద్యాలయంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? పైగా నారాయణ స్కూల్స్ లోనూ, కాలేజీల్లోనూ చదువు కుంటున్న ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం చూశాం.. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెబుతుందా..?

పైగా 6 వ క్లాసు నుంచే ఐఐటి అంటూ, సెంట్రల్ సిలబస్ అంటూ ఇంకేదో కహానీలు చెబుతూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.. తమ పిల్లలు ఇక్కడ చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరు కుంటారని తల్లిదండ్రులు అనుకుం టుం టారు.. కానీ పసి మొగ్గలు వాడిపోతా యని ఊహించలేకపొతున్నారు.. కొందరు పిల్లల కోసం.. కొందరు సమాజంలో ప్రిస్టేజీ కోసం నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లల్లో, కాలేజీ లలో లక్షలు వెచ్చించి చదివిస్తుంటారు.. కానీ ఫలితం ఏదైనా ఉంటుందా అంటే సమాధానం శూన్యంగానే కనిపిస్తుంది.. మా కాలేజీలకు, మా స్కూల్ పిల్లలకు అంత ర్యాంకు, ఇంత ర్యాంక్ అంటూ దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థ మాదే అంటూ ఊదరగొడుతుంటారు.. కానీ వాస్తవానికి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా ఈ విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నది వాస్తవం..
ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీలలో అత్యు న్నత విద్య దొరుకుతుంది.. దేశం గర్వించ దగిన స్థాయికి ఇక్కడ చదివిన వారు చేరుకుంటున్నారు.. కానీ స్వలాభం కోసం స్వార్ధంతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పాపం నిరుపేదల జీవితాల మీద పడుతోంది.. ఇంతటి పాపం చేస్తున్న వీరు సాధించేది ఏమిటి..? భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు.. తగిన శిక్ష విధిస్తాడు.. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో విధించాడు కూడా మారేందుకు మనిషి రాక్షషుడిగా మారుతున్నాడు..? ఒక్కసారి అందరూ ఆలోచించాలి. విద్యను వ్యాపారంగా మారుస్తున్న నారాయణ లాంటి విద్యా సంస్థలకు ఊడిగం చేసేవారు కళ్ళు తెరవాలి. డబ్బు ఈరోజు ఉంటుంది.. రేపు పోతుంది. కానీనిజాయితీ ఎప్పటికీ మీకుమిగిలి ఉంటుంది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉంటున్న నారాయణ మెప్పుకోసం ఇక్కడి ప్రభుత్వం సిగ్గులేకుండా పనిచేస్తుండటం గర్హనీయం.. అక్కడ గురువుగారు నారాయణకు బాసటగా నిలుస్తుంటే.. ఇక్కడ శిష్యుడి అదే నారాయణకు బానిసగా నిలవడం క్షమించరాని నేరం.. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి, సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, వెలిమెల గ్రామం సర్వే నెంబర్ : 19/పార్ట్ లో నారాయణ విద్యా సంస్థల బిల్డింగ్స్ మీద, దానికి వచ్చిన అనుమతుల మీద, అక్కడ వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారాలపై.. అధికారులు చేస్తున్న మాయాజాలంపై.. తన మన బేధాలు లేకుండా.. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ఈ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సరైన ఎంక్వయిరీ చేసి.. విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోకుండా.. కాపాడాలని సామాజిక వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు..