Sunday, September 14, 2025
spot_img

రెప్పపాటు కూడా కరెంట్‌ పోవద్దు

Must Read
  • త్వ‌ర‌లోనే రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాల‌సీలు
  • విద్యుత్‌ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
  • వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ
  • అధికారుల స‌మీక్ష‌లో భట్టి విక్రమార్క హామీ

రాబోయే ఎండాకాలంలో రెప్పపాటు కూడా కరెంట్‌(power) పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. గురువారం ప్రజాభవన్‌ లో ఎండాకాలంలో కరెంట్‌ సరఫరాకు సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. వేసవిలో విద్యుత్ ప్రణాళికపై ఎన్పీడీసీఎల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించామని, పూర్తి సన్నద్ధతతో ఉన్నామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. రైతులు, పారిశ్రామిక వేత్తలు విద్యుత్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాదాద్రిని గత ప్రభుత్వం వదిలేయడం వల్ల భారం పెరిగిపోయిందని, పర్యావరణ అనుమతులు వేగంగా తీసుకొచ్చి యాదాద్రి యూనిట్-2 ప్రారంభించుకున్నామన్నారు. విద్యుత్‌ సమస్యలపై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ 1912పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. 1912కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో మార్చి నెలలో పీక్‌ డిమాండ్‌ 6,328 మెగావాట్లు ఉందని.. ఆ మేరకు కరెంట్‌ సరఫరా చేసేలా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై విస్తృత సమావేశాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాలను తక్షణమే పర్యవేక్షణ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ డైరెక్టర్ లను, చీఫ్ ఇంజనీర్ల ను ఆదేశించారు. గ్రామాలకు వెళ్లి స్థానిక అవసరాలకు అనుగుణంగా రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిందిగా సూచించారు. వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌ కో సీఎండీ కృష్ణభాస్కర్‌, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This