- అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
- అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి..
- వేల గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్..
- మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
- ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో ప్రభుత్వ భూములే లక్ష్యంగా నకిలీ పత్రాల సృష్టి..
- మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు.. అయినా అగని నిర్మాణ పనులు..
- మునుత్ ట్రస్ట్ మహావీర్ జైయిన్ను పావుగా వాడుకొని ప్రభుత్వ స్థలాలకు ఎసరు..
- అన్న మహిపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులకు బినామీల పేరిట నకిలీ పత్రాల సృష్టి..
- గూడెం బ్రదర్స్ కబ్జాలకు చరమగీతం పాడేది ఎప్పుడు..?
- వీరిపై సిబిఐ అధికారులు విచారణ చేస్తే భారీ అక్రమాలు బట్టబయలైయ్యే అవకాశం..
- పటాన్ చెరువు నియోజకవర్గంలో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న వీరిపై చర్యలెప్పుడు?
- వారు సృష్టించిన పత్రాలు ముమ్మాటికి అక్రమ పత్రాలే అంటున్న బాధిత ప్రజలు..
- అధికారం, డబ్బు ఉంటే చట్టాలతో పని లేదంటున్నట్లు వ్యవహరిస్తున్న గూడెం బ్రదర్స్..
- సంగారెడ్డి జిల్లాలో వీరు చేస్తున్న కబ్జాలు, మోసాలు వరుస కథనాలతో మీ ముందుకు తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’
నిజంగా కొందరు మోసాలు చేయడానికే పుడతారు.. అలాంటి వారికే డబ్బు, పరపతి, అధికారం దక్కుతుంది.. చివరికి కాలం సైతం వారికే సపోర్ట్ చేస్తుంది.. వినడానికి ఇది ఎబ్బెట్టుగా ఉన్నా ముమ్మాటికీ నిజం.. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం.. ఈ కోవలోకే వస్తారు గూడెం బ్రదర్స్.. వీరు చేస్తున్న అక్రమ పర్వాలు ఎన్నో.. పుంఖాను పుంఖాలుగా రాసినా వీరి చరిత్ర తరగదు.. ఆదాబ్ ఎన్నో దఫాలుగా వీరి అక్రమ చరిత్ర గురించి రాసింది.. మరోసారి వారి అక్రమ పర్వాలను వరుసగా అందించ డానికి, అమాయక ప్రజలకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకుంది.. ఈ క్రమంలో ఈ కథనం..

సంగారెడ్డి జిల్లాలో, పటాన్ చెరు నియోజకవర్గంలో, అమీన్ పూర్ మున్సిపాలిటీలో.. గోల్డెన్ కీ మిరాకిల్ అనే నిర్మాణ సంస్థ పేరుతో కబ్జాలకు తెర లేపారు గూడెం బ్రదర్స్.. గూడెం మధుసూదన్ రెడ్డి అన్న మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో గత ప్రభుత్వంలో చట్టాలతో పని లేకుండా.. దొడ్డి దారిన సొమ్ము సంపాదించుటకు ప్రక్క ప్రణాళిక రూపొందించుకున్నారు ఈ అక్రమార్కులు.. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153లకు సంబంధించిన.. చక్రపూరి కాలనీ లే ఔట్ లో ఖాళీ స్థలాలపై కన్నేశాడు గూడెం మధుసూదన్ రెడ్డి.. కాగా ఇతగాడు తన ఎమ్మెల్యే అన్నను అడ్డుపెట్టుకొని 1981,1982 కు సంబంధించి 1985 సంవత్సరంలో చేసిన అప్రూవల్ లే అవుట్ కు సంబంధించిన ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ పోయినట్లు.. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో 2021 అక్టోబర్ నెలలో మునుత్ ట్రస్ట్ పేరుతో ఫిర్యాదు చేపించారు ఈ కబ్జాకోర్లు.. నాటి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని, ఒరిజినల్ పత్రాలు పోయినట్లు అక్రమంగా సర్టిఫికెట్ పొందడం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మునూత్ ప్రైవేట్ ట్రస్టుకు సంబంధించిన మహావీర్ జైయిన్ ను అమీన్పూర్ లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేయుటకు పావుగా వాడుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినట్లు అక్రమంగా పోలీస్ స్టేషన్ నుండి పొందిన సర్టిఫికెట్ తో గూడెం మధుసూదన్ రెడ్డి చక్రపురి కాలనీ లే ఔట్ ఖాళీ స్థలాలపై కన్నేశాడు.. ప్రభుత్వ భూములను, అమాయక ప్రజల స్థలాలను కబ్జా చేయుటకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కబ్జాకోర్లు..

పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతగాడి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి పేరిట కబ్జాలకు పాల్పడటం ఈ ప్రాంతంలో చర్చ నియాంశంగా మారింది.. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకొని కొల్లగొట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో వెంకట రమణ కాలనీ లే అవుట్ లో.. లే అవుట్ అని బోగస్ లే అవుట్ సృష్టించి, ప్రభుత్వ స్థలంతో పాటు పార్కు స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇటీవలే సస్పెండ్ అయిన సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్లను మేనేజ్ చేసుకుని, నకిలీ పత్రాలను సృష్టించి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కబ్జారాయుళ్లు.. వేల గజాల విస్తీర్ణంతో కూడిన ప్లాట్లు ఉన్నట్లు.. ప్లాట్ నెంబర్లకు బై నెంబర్లు వేసి, దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు మునుపు ట్రస్ట్ మహావీర్ జైన్ ను పావుగా వాడుకొని ఇతని బినామీగా ఉన్న సుధీర్ కీర్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాలకు పాల్పడుతూ అరాచకాలను సృష్టిస్తూ.. అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.. గత ప్రభుత్వంలో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండడం, పఠాన్ చెరు నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టుటకు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు కాజేయుటకు గూడెం మహిపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ్ముడు మధుసూదన్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. సర్వే నెంబర్ 152లో ఉన్న ప్రభుత్వ, అసైండ్ స్థలాన్ని కాజేశారు ఈ కేటుగాళ్లు.. సదరు ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమి అన్నట్లుగా నకిలి పత్రాలను సృష్టించి, అక్రమంగా పొందిన అనుమతులతో యదేచ్చగా నిర్మాణ పనులు చేస్తూన్నారు.. ఇలా అక్రమంగా కబ్జా చేసిన స్థలాల్లో దొడ్డి దారిన పొందిన నిర్మాణ అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపట్టి సామాన్య ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు.. గూడెం మధుసూదన్ రెడ్డి బినామీల పేరుతో వందల డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడి, ఈడి కేసులో విచారణ ఎదుర్కొంటూన్న..సదరు స్థలాలు ఈడి కి అటాచ్ అయినా.. వీరి అక్రమాలకు మాత్రం అడ్డు కట్ట వేయలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.. కబ్జాలకు పాల్పడిన స్థలాల్లో మాత్రం నిర్మాణాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు సంబంధిత హెచ్.ఎం.డి.ఏ., రెవెన్యూ అధికారులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దృష్టి సారించి పేదల ప్రక్షాన పోయి వాస్తవాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటూ ఉన్నామని అంటున్నారు.. కానీ ఆ దిశగా నేటికీ గోల్డెన్ కి అక్రమాన్ని కూల్చివేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.. ప్రభుత్వ స్థలాలకు డాక్యుమెంట్లు సృష్టించిన మునుత్ ప్రైవేట్ ట్రస్టు మహావీర్ జైయిన్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేస్తే వాస్తవాలు బట్టబయలు అవుతాయని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. విరి అక్రమాలతో పాటు గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో ప్రభుత్వ, పార్కు స్థలాలు కబ్జా చేస్తున్న వ్యవహారంపై విచారణ చేసి, అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, పార్కు స్థలాలు కాపాడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.. చక్రపురి కాలని లే ఔట్ లో, వెంకటరమణ కాలని లే అవుట్ పేరిట చేస్తున్న కబ్జాల వ్యవహారానికి సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ .. ‘‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’’..