- 50మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన వైనం.
- హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం..
- ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
- విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే బాద్యులెవ్వరు..?
విద్యార్థులు పాఠశాల ఫీజు కట్టలేదని కనీసం కనికరం లేకుండా పరీక్ష రాయాల్సిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజ మాన్యం తీరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. నందిగామ మండలం రంగపూర్ గ్రామంలోని హిప్పో క్యాంపస్ స్కూల్ లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఫీజును పూర్తిగా చెల్లించ లేదని, తరగతి గదుల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఫీజు పూర్తిగా చెల్లించలేని సుమారుగా 50మంది విద్యార్ధులను స్కూల్ యాజమాన్యం ఉదయం నుంచి ఆరుబయట కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఫీజు కట్టడంతో పలువురు విద్యార్థులను పరీక్షకు అనుమతి ఇచ్చారు. మిగతా వారిని అలాగే ఆరుబయట కూర్చో బెట్టారు. మిగతా వారు పాఠశాలకు వెళ్లి పరీక్షకు అనుమతించండి ఫీజు కాస్త ఆలస్యంగా చెల్లిస్తామని తల్లిదండ్రులు తెలిపినప్పటికి ఖచ్చితంగా పాఠశాల మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనోభావాలు దెబ్బతింటే…
పాఠశాలలో తోటి విద్యార్థుల ముందుగానే ఫీజు చెల్లించి పరీక్షలు రాస్తుంటే, ఫీజు చెల్లించలేని విద్యార్థులను అవమానకరంగా ఆరుబయట కూర్చోబెడితే విద్యార్థుల మనోభావాలు దెబ్బ తిని, బాధలో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే భాద్యులు ఎవ్వరిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యమని, ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు పాల్పడుతున్న అఘాయిత్యాలను టీవీల్లో, వార్తల్లో చూస్తూనే ఉన్నామని వారి ఆవేదనను వెలిబుచ్చారు.
యాజమాన్యం వివరణ కోరగా..
పాఠశాల యాజమాన్యం వివరణ కోరగా సమయానికి పాఠశాల ఫీజు చెల్లించని విద్యార్థులను మీటింగు హాల్లో కూర్చోబెట్టామని తెలిపారు. ఫీజుల వివరాలు ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించామని, వారి అంగీకారంతోనే పరీక్షకు అనుమతించలేదని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు చాలాసార్లు ఫీజు చెల్లించాలని చెప్పినప్పటికి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. విద్యార్థులు చెల్లించే ఫీజులపైనే పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారి మనోభావాలు దెబ్బతినకుండా పాఠశాల యాజమాన్యం ముందు కు సాగాలని పలువురు సూచిస్తున్నారు.