ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి వెల్లడి
పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం సీసీఎల్ఏ జయలక్ష్మి అధికారులతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గం, వార్డు సచివాలయం-82 పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న పక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైనవిధంగా అందుతుందా.. లేదా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయం పరిధిలో 294 పెన్షన్లు ఉండగా.. ఎం.శ్రీను, బి.భూలక్ష్మి (దివ్యాంగ పెన్షన్లు), వై.వెంకటేశ్వరమ్మ, దుర్గా భవాణి (విడో పెన్షన్లు)లకు పెన్షన్లు అందించే పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జి.జయలక్ష్మి మాట్లాడుతూ అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు, మండలస్థాయి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతోందని తెలిపారు. సీసీఎల్ఏ వెంట యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.