- మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్లో ప్రభుత్వం
- రూరల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్
- తెలంగాణ గ్రామీణ అందాలకు దక్కనున్న ప్రపంచవ్యాప్త ప్రచారం
- మిస్ వరల్డ్ ఈవెంట్ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి తోడ్పాటు
- బుధవారం హైదరాబాద్కు చేరుకున్న 65దేశాల ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మీకంగా చేపట్టిన మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే వివిధ దేశాల నుండి ప్రతినిధులు నగరానికి చేరుకుగా తాజాగా బుధవారం నాడు మరో 65మంది ప్రతినిధులు పోటీల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం తరఫున సాంప్రదాయబద్దంగా ఆహ్వనం పలికారు. సమయం సమీపిస్తున్న తరుణంలో నగరంలో హైఆలెర్ట్ ప్రకటించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటకం అంటే.. ఇప్పటి వరకూ మనకు ఎక్కువ వినిపించే పేరు ఒక్కటే.. అదే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. కాని మిస్ వరల్డ్ ఈవెంట్ల నిర్వహణను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పర్యాటకంను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తుంది. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్ ను అందివచ్చిన అద్భుత అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ పోటీలు ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, గ్రామీణ పర్యాటకంకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు, పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు తద్వారా గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా వరంగల్, హన్మకొండ, ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను షోకేజ్ కు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈనెల 12న ఆధ్యాత్మిక టూరిజానికి చిహ్నంగా ఉన్న నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని, బుద్ధిష్టు థీమ్ పార్కును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నెల 14 న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్ లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను సందర్శిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యం ను తిలకిస్తారు. ఈ నెల15 న మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజం లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు.
ఈ నెల 16న మహబూబ్ నగర్ జిల్లాలోని లోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు. 21న శిల్పారామం లో తెలంగాణ కళాకారుల చే నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్ హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలిపే అవకాశం లభిస్తుంది.
గ్రామీణ పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు ఇవే,…
బుద్ధవనం – బౌద్ధ థీమ్ పార్క్…
తెలంగాణలోని నాగార్జునసాగర్ వద్ద అమరి ఉన్న బుద్ధవనం , బౌద్ధ థీమ్ పార్క్, బౌద్ధ సంస్కృతి , ఆధ్యాత్మికతకు ప్రత్యేకించిన ఆకర్షణ. ఇది బుద్ధుని విగ్రహాలు, స్తూపాలు, ధ్యాన మండపాలతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక్కడి థీమ్ పార్క్ బుద్ధుని జీవితం, బోధలు, బౌద్ధ కళ మరియు సంస్కృతిని సజీవంగా ప్రదర్శిస్తుంది. ధ్యానం, యోగా కార్యక్రమాలు, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ల ద్వారా మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు పర్యాటక రంగాన్ని బలపరుస్తూ, సాంస్కృతిక మార్పిడి మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోంది. ఆధ్యాత్మిక శాంతి, జ్ఞానోదయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది ఒక ఆదర్శ స్థలం. బౌద్ధమతం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్థలాన్ని తప్పక సందర్శించాలి. ప్రకృతి సౌందర్యం, నిశ్శబ్దత మనస్సును ఆత్మావలోకనం చేయడానికి అనువైన వాతావరణాన్ని ఇస్తాయి. బుద్ధవనం ఆధ్యాత్మిక పునరుజ్జీవనం మరియు స్వీయ అన్వేషణకు ఒక పవిత్ర కేంద్రంగా నిలిచింది.
వేయి స్థంభాల గుడి…
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న వేయి స్థంభాల గుడి, కాకతీయ రాజవంశం శిల్పకళా వైభవానికి నిదర్శనం. రుద్రదేవ మహారాజు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి శివుడు, విష్ణువు సూర్యదేవుడికి అంకితమైంది. ప్రత్యేకమైన త్రికూటాకార నిర్మాణంతో, నక్షత్ర ఆకారపు వేదికపై నిలిచి ఉంది. గర్భగుడి చుట్టూ 1000కు పైగా సున్నితంగా చెక్కబడిన స్థంభాలు ఉన్నాయి. ప్రధాన ఆకర్షణ ఏకశిలా నంది విగ్రహం, ఇది శిల్పుల నైపుణ్యాన్ని చాటుతుంది. ఈ దేవాలయం తురుష్కుల దండయాత్రలో కొంత భాగం నాశనమై, 20వ శతాబ్దంలో పునరుద్ధరించబడిరది. ప్రాచీన భారతీయ వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన నమూనాగా ఇది. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ గుడిని సందర్శిస్తారు.
వరంగల్ కోట….
కాకతీయ రాజవంశం యొక్క వాస్తుశిల్ప వైభవానికి అద్భుతమైన నిదర్శనమే వరంగల్ కోట. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోట కాకతీయుల రాజధానిగా మరియు వ్యూహాత్మక స్థానంగా పనిచేసింది. 3 కిలోమీటర్లకు పైగా విస్తరించిన భవ్యమైన ప్రాకారాలు, దీని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. కాకతీయ కళా తోరణం అనే సూక్ష్మశిల్పాలు కలిగిన తోరణం ఈ కోట యొక్క ప్రత్యేక ఆకర్షణ. స్వయంభూ దేవాలయంలోని శివలింగం భక్తులకు పవిత్ర తీర్థస్థలం. కోటలోని ధాన్యాగారాలు, సరుకు గిడ్డంగులు ఆ కాలపు సంపదను తెలియజేస్తున్నాయి. తెలంగాణ సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఈ కోట ఒక జీవంత ముద్ర. చారిత్రక ప్రాధాన్యత, శిల్ప సౌందర్యం కారణంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి తప్పక వెళ్లాల్సిన ప్రదేశంగా ఇది నిలిచింది.
రామప్ప గుడి….
ములుగు జిల్లా పాలంపేట వద్ద ఉన్న రామప్ప గుడి, కాకతీయ సామ్రాజ్యం వాస్తు శిల్ప సంపదకు ప్రతీక. ఇది 13వ శతాబ్దంలో గణపతి దేవ మహారాజు పాలనలో నిర్మించబడిరది. ఈ శివాలయానికి ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు, సుందరమైన నృత్య ముద్రలు, పురాణ కథలను చిత్రించే శిల్పాకృతులు అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే, గర్భగుడి పైకప్పు తేలికైన ఇటుకలతో నిర్మించబడి, శబ్ద ప్రతిధ్వనిని మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ఈ గుడి భూకంపన-నిరోధక నిర్మాణ శైలికి ప్రసిద్ధి. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడిన ఈ దేవాలయం చుట్టూ సహజ సుందరమైన చెరువు, హరిత వనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే పర్యాటకులు కాకతీయుల శాశ్వత కళా వైభవాన్ని తప్పక ప్రశంసిస్తారు.

పోచంపల్లి చీరలు…
పోచంపల్లి (పుట్టపాక) ప్రాంతంలో నేతన్న మేధస్సుతో తయారయ్యే పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నేతకళలో నూలు లేదా పట్టు దారాలను డైలో ముందుగా రంగు వేసి, సంక్లిష్టమైన జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ‘‘ఇకత్’’ టెక్నిక్లో రంగు వేసిన దారాలు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా నేతగార్లు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తారు. ప్రతి చీర తయారీకి 10-20 రోజులు వరకు సమయం పడుతుంది. 2005లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఈ చీరలు యునెస్కో యొక్క ‘‘సిటీ ఆఫ్ క్రాఫ్ట్’’ గా గుర్తింపు పొందాయి. సాంప్రదాయ రంగులతో పాటు ఆధునిక డిజైన్లతో కూడిన పోచంపల్లి చీరలు భారతదేశం తో సహా విదేశీ మార్కెట్లలోనూ డిమాండ్ కలిగివున్నాయి. సహజ రంగులను ఉపయోగించడం వల్ల ఎకో ఫ్రెండ్లీ గా ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ వేదికపై తెలంగాణ సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఈ చీరలు.

పిల్లల మర్రి వృక్షం…
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పిల్లల మర్రి వృక్షం (పిల్లలమర్రి) ఒక అద్వితీయ ప్రకృతి ఆశ్చర్యం. ఫికస్ బెంగాలెన్సిస్ జాతికి చెందిన ఈ ప్రాచీన వృక్షం సుమారు 700 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. 3 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ వృక్షం యొక్క ఎయిరియల్ రూట్లు భూమిపైకి వేలాడుతూ, సహజ ‘‘స్తంభాల’’ సృష్టిస్తాయి. స్థానికులకు ఇది సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సహజ వేదికగా పనిచేస్తుంది. పక్షులు, కీటకాలు, చిన్న జంతువుల ఆవాసానికి ఆశ్రయం ఇచ్చి జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. స్థానిక పురాణాల ప్రకారం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాది పర్యాటకులు విచ్చేసి, ఈ ప్రకృతి విస్మయాన్ని ఆరాధిస్తారు. ప్రభుత్వం ఇది ఒక పరిరక్షిత స్మారకంగా గుర్తించింది. ప్రాచుర్యం, పర్యావరణ ప్రాధాన్యతలతో ఈ వృక్షం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి సంకేతం.
యాదగిరిగుట్ట దేవాలయం…
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పంచముఖ నరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుట్ట పైకి 120 మెట్లు ఎక్కి చేరుకునే ఈ దేవస్థానం చరిత్ర చాళుక్యుల కాలానికి చెందినది. 2016లో ప్రభుత్వం దీన్ని రాజస్థాన్ మార్బుల్, బంగారు పూతలతో అలంకరించింది. ప్రధాన గర్భగుడిలో స్వయంభూ శిలారూపంలో నరసింహుడు, లక్ష్మీదేవి ఏకీభావంతో కనిపిస్తారు. ద్రవిడ, చాళుక్య వాస్తుశైలి మిళితమైన ఈ ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక-పర్యాటక మహత్వాన్ని సార్థకం చేస్తోంది.