- సుమారు 17 తులాల బంగారం,రూ.5లక్షల నగదు చోరీ..!
- ఓ విలేకరి ఇంటికి సైతం కన్నం వేసిన దొంగలు
- ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు
- తాండూరులో చర్చనీయాంశంగా మారిన వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన బస్వరాజ్ గౌడ్ ఓ ప్రధాన పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అంగన్ వాడి టీచర్ గా పనిచేస్తున్నారు. శనివారం ఎవరి డ్యూటీ కి వారు వెళ్లారు. అదే సమయంలో పట్టణంలో సాయిపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని బస్వరాజ్ కవరేజీ కోసం వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చూసే సరికి ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా తమ బందువులకు చెందిన సుమారు 7 తులాల బంగారం, వారికి చెందిన మరో 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీంతో పాటు బందువులు ఇంట్లో దాచుకున్న రూ. 2లక్షలకు, వారికి చెందిన చీటీ డబ్బులు మరో రూ. 3లక్షలు మొత్తం రూ. 5లక్షల వరకు దొంగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపడంతో విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్ లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. పట్టణంలో ఉదయం మధ్యాహ్నం మరో చోరీ జరగడంతో తాండూరు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి.