- పైలట్ ఆత్మహత్యే కారణమంటూ అమెరికన్ మీడియా కథనాలు
- మండిపడుతూ లీగల్ నోటీసులు పంపిన పైలట్ సంఘాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్నే కారణమంటూ అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిందంటూ వార్తలు వండి వార్చాయి. అయితే ఈ కథనాలను మొట్టమొదటి నుంచి పైలట్ సంఘాలు ఖండిస్తూనే ఉన్నాయి. తుది రిపోర్ట్ రాక ముందే ఎలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారంటూ యూనియన్లు మండిపడ్డాయి. తాజాగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్లకు పైలట్ సంఘాలు లీగల్ నోటీసులు పంపించాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. పాశ్చాత్య మీడియాతో ప్రాథమిక నివేదికను తప్పుగా అర్థం చేసుకుందని పైలట్ సంఘాలు ధ్వజమెత్తాయి. ఇదిలా ఉంటే మీడియా కథనాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్టీఎస్బీ కూడా తీవ్రంగా ఖండించింది. ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో పైలట్ సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ మీడియా క్షమాపణ చెప్పాలని యూనియన్లు కోరారు.
ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ది వాల్ స్ట్రీట్ర్ జర్నల్, రాయిటర్స్లకు లీగల్ నోటీసు జారీ చేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో.. పైలట్ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్ ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11ఆ దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు.
ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600 – 4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.