కేసీఆర్కి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.. కేసీఆర్ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్ర కులాలకు ఒక న్యాయం.. బడుగులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో సొంత బిడ్డలు తప్పుచేసినా అందరికీ ఒకే రీతిలో శిక్ష ఉంటుందని గతంలో గొప్పగా చెప్పుకున్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ మాటలు నీటి మూటలేనా అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా ఒకే న్యాయం అనుకుంటే.. నాడు ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసినట్లే ఇప్పుడు కవితను కూడా బర్తరఫ్ చేయాలని కోరారు. ‘టీఆర్ఎస్ పార్టీకి మేం కూడా ఓనర్లమే అన్నందుకు ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, మెడ పట్టి గెంటి వేశారు. అదే విధంగా పార్టీ నియమావళిని ఉల్లంఘించారని దివంగత నేత టైగర్ ఆలె నరేంద్రను, విజయశాంతిని పార్టీ నుంచి బహిష్కరించారు’ అని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ పార్టీ నియమావళిని ఎవరు ధిక్కరించినా తన, మన అనే తేడా లేకుండా సొంత బిడ్డలనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కేసీఆర్ తన మాట మీద నిలబడే వారే అయితే కూతురు కవిత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నించారు. పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్న కల్వకుంట్ల కవితను ఎందుకు పార్టీ నుంచి గెంటివేయడంలేదు అని జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.పార్టీ నియమావళి అందరికీ ఒకే తీరుగా ఉండదా అని అడిగారు.

పార్టీలో బిడ్డకు ఒక న్యాయం, బడుగులకు ఇంకో న్యాయమా అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న 60 లక్షల మంది సాధారణ కార్యకర్తలకైనా, కేసీఆర్ కూతురుకైనా ఒకే రూలు అయితే పార్టీ అధినేత కేసీఆర్ వెంటనే కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మాత్రమే బలిచేస్తామని, అగ్ర కులాలు, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేమని బహిరంగంగా ప్రకటించాలనిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సూచించారు.