కేసీఆర్కి బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభం
మీడియా సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ (2025 మే31న) హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ గతంలో అశోక్ నగర్లో ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్కి మార్చామని చెప్పారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు కవిత ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణ సోయితో పరిపాలన చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని కవిత అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.

జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులర్పించనివారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని చెప్పారు. ‘తెలంగాణ గ్రహచారం బాగలేక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? అమరులు శ్రీకాంతాచారి లేదా యాదిరెడ్డి లేదా కాళోజీ లేదా పీవీ నరసింహారావు పేరు పెట్టండి. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం ఎందుకు స్పందించడంలేదు? సీఎం అంత బలహీనంగా ఉన్నారు.
పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడతామని చెప్పింది. పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి నీళ్లు తెలంగాణకు శాశ్వతంగా దూరంకానున్నాయి.జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి.
200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? రైతులను రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా?. అది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా? ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారు.
తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు. కేసీఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చింది.తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం దారుణం. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహా ధర్నా చేపడతాం. తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తోంది.
ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదు. బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని బీజేపీని హెచ్చరిస్తున్నా. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేడుతాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుంది. మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తాం.
మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుంది. జాగృతిలో మైనారిటీ హక్కల కోసం ముస్లి, సిక్కు, క్రిస్టియన్ భాగాలను ఏర్పాటుచేస్తాం. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తాం. మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే మరో కన్ను జాగృతి. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోం. తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణం. 8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదు.
గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ చూపిస్తాం. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి. ఈ సంస్థను ప్రారంభించి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తింది. తెలంగాణ జాగృతి. కేసీఆర్, జయశంకర్ సార్ స్ఫూర్తితో జాగృతి సంస్థ పుట్టింది. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారు. సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన వారికి ఉద్యమాభివందనాలు.చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగానే కేసీఆర్ గారు చేశారు’ అని కవిత పేర్కొన్నారు.