సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి అయిన ఆయన కొడుకు లోకేష్ ఏపీ విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పదో తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు గారూ.. మీరు, మీ కుమారుడు లోకేశ్ ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారు అని జగన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం (మే 31న) ఎక్స్లో పోస్టు పెట్టారు.‘మీ పాలన అధ్వాన్నంగా ఉంది. విద్యా రంగం భ్రష్ఠు పట్టిపోయింది. టెన్త్ పరీక్షా పత్రాల వ్యాల్యుయేషన్ కూడా సరిగా చేయించలేని దుస్థితిలో ఉన్న మీరు.. మిగతా వ్యవస్థలను ఇంకెంత బాగా నడుపుతున్నారో అర్థంవుతోంది’ అని జగన్ ఎద్దేవా చేశారు. ఏపీలో 6.14 లక్షల మంది రాత్రనక, పగలనక కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలు సక్రమంగా దిద్ది పారదర్శకంగా ఫలితాలను వెల్లడించాల్సిన మీరు ఘోరంగా చేతులెత్తేశారు అని ఫైర్ అయ్యారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన విద్యా శాఖ మంత్రి లోకేశ్ మొదలుకొని అందరిపైనా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.