Monday, June 2, 2025
spot_img

అంతా నా ఇష్టం.. అంటున్న డీఈఓ..

Must Read

ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు చాలవు ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలూ కదులుతాయి
డీఈవో కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరగణాలేనట సారు యాడికి పోయినా వీవవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయట
సారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావట 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్వో కూడా ఈ సారుకే పరమ భక్తుడట
డీఈవో ఆఫీసు నిండా పెద్ద సారు అనుచరులదే హవా, వసూళ్ల పర్వం నడుస్తుందట ˜ ప్రభుత్వం డీఈఓ భిక్షపతి సారుపై ఇకనైనా చర్యలు తీసుకుంటుందా? లేక,
మా జమానాలో గివన్నీ మాములే అని సరిపెట్టుకుంటుందా?.. వేచి చూడాలి

నల్లగొండ డీఈవో ఆఫీసు.. డీఈఓ భిక్షపతి అక్రమాలకు అడ్డాగా మారింది. ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవని జిల్లా అంతట టాక్‌ నడుస్తోంది. విచిత్రమేంటంటే గడిచిన రెండేళ్లుగా ఈ సారుపై లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ పట్టించుకోకపోవవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఒక సీఎం కన్నా ఉన్నత స్థానంలో ఉన్న అధికారిగా చలామణి అవుతూ తననుతాను గొప్పగా ఊహించుకుంటూ నల్లగొండ జిల్లాను జేబు రుమాలు చేసి ఆడేసుకుంటున్న డీఈఓ భిక్షపతి వ్యవహారంపై జిల్లా అంతటా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తనకు నచ్చిన వాళ్లు బరితెగించిన పట్టించుకోకుండా.. తనకు నచ్చనివాళ్లు చిన్న తప్పులు చేసినా కొండంతలు చేసి ముప్పుతిప్పలు పెడుతున్న ఇతగాడి వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టరుకు సారు తీరుపై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటే సారు రేంజ్‌ ఎంత పెద్దదో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఒక జిల్లా అధికారిగా పనిచేస్తున్న డీఈఓ భిక్షపతి గతంలో పెద్దపల్లి జిల్లాలో రూ.5000 లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండై తిరిగి విధుల్లో చేరినప్పటికీ తన తీరు మార్చుకోలేదు.

విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మరిచి తాను తప్పుదోవ పట్టడమే కాకుండా తన నిరంకుశ పోకడలతో మితిమీరిన అహకారంతో జిల్లా విద్యా వ్యవస్థను పాతాళానికి తొక్కేస్తున్నారు. డీఈఓ భిక్షపతిని తక్షణమే విధుల నుంచి తప్పించి అతని అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

సారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అంతా ఇంత కాదట

డీఈఓ భిక్షపతికి ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకేనేమో సారు కరుణాకటాక్షాలు తమ మీద ఉంటే చాలనుకుంటున్నారట చిరుద్యోగులు. నిజానికి సారు తలుచుకోవాలేగానీ ప్రభుత్వ నిబంధనలేవీ అడ్డు రావట. సారు అనుకున్న పోస్టులో కూర్చో పెడతాడన్న మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే అడ్డదారుల్లో డీఈవో ఆఫీసులో చాలా మంది ఉద్యోగులు తిష్ట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ మార్గంలో సంపాదించే సొమ్మును తన చేతికి అంటకుండా పెద్ద సారు కార్యాలయంలో తాను అక్రమంగా నియమించుకున్న సిబ్బందితో తీసుకుంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలల అనుమతులు, రెన్యువల్స్‌, పరీక్షా ఫీజుల విభాగం, ఓపెన్‌ టెన్త్‌ విభాగం, అకౌంట్స్‌ విభాగం, పలు ప్రభుత్వ విద్యా సంస్థల టెండర్లు ఇలా చెప్పాలే గాని సారు ఆదాయం నెలకు రూ.10 లక్షల పైమాటేనని అంటున్నారు.

ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు

గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు, కొత్త డీఎస్సీ నియామకాలు జరిగినప్పటికీ ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లు సారు సమక్షంలోనే ఘనంగా జరిగాయి. ఈ అక్రమ డిప్యుటేషన్‌లపై తెలంగాణ లోకాయుక్తలో కొంత మంది కేసులు వేశారు. మరి ఈ డిప్యుటేషన్లు ఎందుకు జరిగాయో సారు ఎవరికీ చెప్పడం లేదు. తప్పుడు స్పౌజ్‌ పాయింట్లు ఉపయోగించుకొని కొంత మంది టీచర్లు పోస్టింగులు తీసుకున్నారు. వీటిపై డీఈఓ సారు కొంత మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ కూడా చేశారు. వీళ్లను తిరిగి వారం రోజుల్లోపే పునర్నియామకం చేశా. గిట్ల ఎందుకు చేసినవ్ సారూ అని అడిగితే సారు నోరుతెరిస్త ఒట్టు.

ఇక కొంత మంది టీచర్లు 2024 డీఎస్సీలో నియామకమైనవాళ్లు ఇంకా వారి ఎంప్లాయ్‌ ఐడీ క్రియేట్‌ కాకముందే కేవలం వారం రోజుల్లోనే అక్రమ డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపైనా డీఈఓ భిక్షపతి సారు నో రెస్పాన్స్‌. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై డీఈఓ భిక్షపతి సారు ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకున్న దాఖలాలు లేవు. చాలా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అర్హతలేని ఉపాధ్యాయులను నియమించుకొని పాఠశాలలు నడుపుతున్నారు.

ఎస్‌సిఇఆర్‌టి సిలబస్‌ కాకుండా వారికి ఇష్టమైన సిలబస్‌ను‌ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నప్పటికీ డీఈఓ భిక్షపతి సారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఎవరికీ అర్థంకావడంలేదు. వారి నుంచి డీఈఓ భిక్షపతి సారు ఏదైనా లాభం పొందారో లేదో అధికారులు విచారణ చేస్తే గానీ తెలియదు. నిజానికి ఇవి పూర్తిగా రైట్‌ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ 2009కి విరుద్ధమైన పనులు. వీటిపై డీఈఓ భిక్షపతి సారు స్పందించిందిలేదు.

కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అంటకాగుతూ ఆ నాయకులు పాఠశాలలకు హాజరుకాకపోయినప్పటికీ డీఈఓ భిక్షపతి సారు వారిపై అమితమైన ప్రేమను కురిపిస్తూ వారికి హాజరు వేసి మరీ జీతాలు చెల్లిస్తున్నారు. ఎందుకో సారే చెప్పాలి. పాఠాలు చెప్పని టీచర్లకు జీతాలు ఎందుకిస్తున్నారో సారు మాత్రమే చెప్పగలరు. కొంత మంది ఉపాధ్యాయులను అవసరంలేకున్నా డీఈఓ ఆఫీస్‌లో వివిధ హోదాల్లో నియమించుకొని వారితోనే డీఈఓ భిక్షపతి సారు ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సారు యాడికి పోయినా వీవీవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయట

2019 నుంచి 2025 వరకు నల్లగొండ జిల్లాలో సారు హవానే నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. సారు అధికార పార్టీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులొచ్చినా పెద్ద సార్లు పట్టించుకుంటలేరట. ఒక జిల్లా అధికారి ఆరేళ్లుగా ఒకే చోట పోస్టింగ్‌లో ఉండటమేంటి అని ప్రశ్నిస్తే పెద్ద సార్లు ఇంటలేరట. ఎవరైనా సారు మాటను ధిక్కరిస్తే వారి పని అయిపోయినట్టేనట. వారి మీద అసత్య ఆరోపణలు చేయించి అబద్ధ విచారణలు నిర్వహించి చర్యలు తీసుకుంటారని సారుపై మస్తు ఫిర్యాదులున్నాయి.

కొంత మంది కోర్టుకు కూడా పోయిండ్లట. కోర్ట్‌ చెప్పినా సారు ఇంటలేడట. కోర్టుకు తెల్వది కదా సారు ఎంత పెద్దోడో అని. కొంత మంది మండల విద్యాధికారులు కూడా సారుకు కోవర్టులట. బడికి వెళ్లని టీచర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతి నెలా డీఈఓ సారుకు పంపిస్తారని ఆరోపణలు ఉన్నాయి. అందులో కొంత మండల విద్యాధికారులు కూడా తీసుకుంటున్నారట. ఆ విషయం తెలిసినా కూడా డీఈఓ సారు ఏమంటలేడట.

అందుకే డీఈఓ సారును మండల అధికారులు మంచోల్లంటున్నారు. చందంపేట, చింతపల్లి మండలాల్లో ఇద్దరు టీచర్లు ఏళ్లుగా బడికి వెళ్లకుండా జీతం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎంత మంది ఫిర్యాదులు చేసినా, వార్తా కథనాలు రాసినా సారు పట్టించుకుంటలేడు. చింతపల్లి మండలంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడిపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వలేదు. ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ చేసినప్పటికీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదో సారుకే తెలియాలి.

పదో తరగతి మూల్యాంకనంలో పెద్దఎత్తున అక్రమాలు

పదో తరగతి మూల్యాంకనంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో స్టేట్‌ పేజీలో పెద్దఎత్తున కథనం వచ్చింది. ఈ అంశంపై పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పందించారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కూడా నిర్వహించి కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చారు.అయినా కలెక్టర్ నేటికీ ఈ అంశంపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జిల్లాలో ఇప్పటివరకు సుమారు 250కి పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలలను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో జిల్లా అధికారులు చెప్పడంలేదు. ప్రతి సంవత్సరం ప్రైవేట్‌ పాఠశాలల నుంచి డీఈఓ భిక్షపతికి ముడుపులు అందుతాయని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్‌ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.

జిల్లా కలెక్టర్‌ నుంచి కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వరకు ఇలా అందరికీ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్టీఐ కార్యకర్తలు డీఈఓ భిక్షపతి మీద లిఖితపూర్వకంగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు మా జమానాలో గివన్ని మామూలే అని సరిపెట్టుకుంటురా లేక చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS