తెలంగాణ అందం అగ్రరాజ్యంలో తళుక్కుమంది. ఈ ఏడాది మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈమె పేరు కొత్తపల్లి చూర్ణికా ప్రియ. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి ఇటు విద్యలో, అటు ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టిన చూర్ణికా ప్రియ.. హైదరాబాద్లోని ఏఎస్రావునగర్లో పెరిగింది. ప్రస్తుతం సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతోంది.

డల్లాస్ తెలుగు సంఘం నిర్వహించిన అందాల పోటీల్లో మెరిసింది. ఈ ఈవెంట్లో 5 వేల మందికి పైగా పాల్గొనగా చూర్ణికా ప్రియ టాప్ 20లో నిలిచింది. అనంతరం టాప్ 5, టాప్ 3లోనూ చోటు సంపాదించింది. చివరికి సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ను కూడా కైవసం చేసుకుంది. ఈ పోటీలకు జడ్జిలుగా వ్యవహరించిన ఇద్దరిలో ఒకరు ప్రముఖ సింగర్ గీతా మాధురి కావటం గమనార్హం. చూర్ణికా ప్రియకి బాల్యం నుంచి శాస్త్రీయ నృత్యంపై అభిరుచి ఎక్కువగా ఉండేది.
