వర్షాలతో తడి ముద్దై మొలకెత్తుతున్న వైనం
సరైన సౌకర్యాలులేక నష్టాల ఊబిలో రైతులు
ఈ నష్టానికి బాధ్యులు ప్రభుత్వమా? అధికారులా?గన్నీ బ్యాగులు, లారీలు, గోదాంల కొరత?
ప్రభుత్వ ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనేది?సీఎం, మంత్రుల మాటలను పట్టించుకోని అధికారులు
ఇప్పటికే రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం.. కల్లాల వద్ద పడిగాపులు.. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు.. ఎప్పుడు ధాన్యం తరలిస్తారో తెలియదు.. ప్రభుత్వ పెద్దలు మాత్రం ధాన్యం కొనుగోళ్లలో రికార్డులు అంటున్నారు.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.. రెండు నెలలు గడుస్తున్నా స్పందన కరవు.. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు.. కురుస్తున్న వర్షాలు.. కళ్లేదుటే తడిసిపోతున్న వైనం.. కల్లాలోనే మొలకెత్తుతున్న ధాన్యం కుప్పలు.. రైతుల గుండెల్లో కన్నీరు.. తుడిచేదెవరు.. రైతులను ఆదుకునేదెవరు?.. ఈ అలసత్వానికి కారణం ప్రభుత్వ పెద్దలా? అధికారులా?

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండుతుంది. ప్రభుత్వం కూడా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తుంది. గత ప్రభుత్వాలకు మించి మేము ధాన్యం కొంటున్నాం.. రైతులకు సరైన సమయంలో డబ్బులు వేస్తున్నాం.. బోనస్లు ఇస్తున్నాం.. అంటూ చేస్తున్న అనేక ప్రకటనలను మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, మంత్రుల నోటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అటు రైతులు పండించిన ధాన్యం నేటికీ అనేక ప్రాంతాల్లో కల్లాల్లోనే దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కాస్తా నీటిపాలు అవుతోంది. కళ్లెదుటే వర్షపు నీటికి ధాన్యం తడిసిపోతున్నా రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో పడి అరిగోస పెడుతున్నారు. యాసంగి పంటలు కోసి ఇప్పటికే సుమారు 2 నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తికాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా మద్దతు ధరతోపాటు ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్దమయ్యారు.

రైతులు పంటలు కోసి ధాన్యాన్ని కల్లాల్లో పోసి నెలలు గడుస్తున్నా వాటిని కొనేందుకు అధికారులు ముందుకు రాకపోవటం, ధాన్యాన్ని తరలించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఎన్ని సార్లు ఆదేశించినా వారిలో మాత్రం చలనం కనిపించడంలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి కూడా హెచ్చరించినా అధికారుల్లో ఆశించిన స్థాయిలో మార్పు కనబడటంలేదు.
ఇప్పటికే ప్రభుత్వంపై రైతుల్లో కొంత వ్యతిరేక ఉండనే ఉంది. నేటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతోపాటు రైతుభరోసా నిధులు రాలేదు. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించకపోయినా.. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోయినా ప్రభుత్వానికి మరింత మైనస్ అవుతుంది. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో వరి పంట సాగు పెరగడంతోపాటు దిగుబడి కూడా ఉహించని రీతిలో పెరిగింది.

ఈ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కావాల్సిన మేర కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడంలో వెనకబడ్డట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన గన్నీ బ్యాగులను సమకూర్చడంతోపాటు టార్పాలిన్ల ఏర్పాటు, ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
యాసంగి పంటల కాలం ముగిసి 2 నెలలవుతున్నా చాలా గ్రామాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఈసారి ముందస్తు వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంది. అయినా కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మాత్రం వేగం పెంచకపోవడంతో పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఇప్పటికే ఓ రైతు ధాన్యం కుప్పపై చనిపోగా మరికొంత మంది రైతులు ధాన్యం కుప్పలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ధాన్యం కుప్పలకు కావాల్సిన మేర టార్పాలిన్లు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైతులు పోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయి మొలకెత్తుతున్నాయి. దీంతో.. రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. వర్షాల కారణంగా ఎండిన ధాన్యం కాస్తా తడిసి ముద్దైపోయిందని, ఇప్పుడు ఈ ధాన్యాన్ని కొనేదెవరు, తమకు దిక్కెవరని ఆవేధన వ్యక్తం చేశారు.
ఆరుగాలం పాటు కష్టపడి పండించిన ధాన్యం ఇలా కళ్ల ముందే తడిసిపోయి నష్టపోవాల్సి వస్తోందని, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసి వాటిని తరలించడంలో శ్రద్ద తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. అప్పుడు ఎండలకు ఎండి, ఇప్పుడు వర్షాలకు నానుతూ సుమారు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారుల్లో కనీసం మార్పు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ అలసత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోందని మండిపడుతున్నారు. నెలలు గడుస్తున్నా ధాన్యం తరలింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేడు రైతులు నష్టపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యంతోపాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో సరైన చర్యలు తీసుకొని వెంటనే కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలను ఖాళీ చేయకపోతే రైతులు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతోపాటు మరింత ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో రైతుల పక్షాన ప్రభుత్వం, అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.