రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లోని ఒడిశా యూనిట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేస్తున్న చింతన్ రఘువంశీ శుక్రవారం (2025 మే 30న) భువనేశ్వర్లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆఫీసర్ అయిన ఇతను రతికాంత్ రౌత్ అనే మైనింగ్ వ్యాపారి నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేసి మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు తీసుకుంటూ దొరికిపోయాడు.
రతికాంత్ రౌత్ అలియాస్ జులు.. దెంకనల్ అనే ప్రాంతంలో బిజినెస్ చేస్తుంటాడు. అతని వ్యాపార కార్యకలాపాలు జరిగే 14 ప్రాంతాల్లో 2025 జనవరి 8న ఈడీ దాడులు నిర్వహించింది. అనంతరం చింతన్ రఘువంశీ.. రతికాంత్ రౌత్ను లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతను సీబీఐని ఆశ్రయించగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు.
చింతన్ రఘువంశీ అరెస్ట్తో ప్రభుత్వ సంస్థల్లోని అవినీతి మరోసారి తెర మీదికి వచ్చింది. ఈడీ లాంటి ఉన్నత దర్యాప్తు సంస్థల విశ్వసనీయత, జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారింది. ఈడీకి చెందిన ఒక సీనియర్ అధికారి ఇలాంటి కుంభకోణానికి పాల్గొనడం వల్ల పౌర సేవలు, అవినీతి నిరోధక సంస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత దెబ్బతింటుంది. చింతన్ రఘువంశీపై కేసు బుక్ చేసిన సీబీఐ తదుపరి విచారణను ప్రారంభించింది. త్వరలో మరిన్ని విషయాలను వెల్లడించనుంది.