పోలీసులను నిలదీసిన వైఎస్ జగన్
గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదటంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారనే ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదుచేసి ఇలా ఇష్టమొచ్చినట్లు చేయిచేసుకోవటం ఏంటని మండిపడ్డారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు పైన సైతం 24 కేసులు ఉన్నాయని, అంత మాత్రాన ఆయన్ని కూడా నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నటం కరెక్టేనా అని నిలదీశారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని అన్నారు. ఇలా చేసే నైతికత, ఒక వ్యక్తి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే హక్కు పోలీసులకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో నడిరోడ్డుపై పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.