˜ కోట్ల విలువ చేసే పార్కు స్థలం కబ్జా..
˜ నారపల్లి రాజీవ్ రహదారి పక్కనే 1-10 గుంటల పార్క్ స్థలంలో
˜ జైన్ ఎస్టేట్ సంస్థ భారీ అంతస్తుల అక్రమ నిర్మాణం!
˜ జైన్ ఎస్టేట్స్ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యాలి
˜ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి
˜ ఇక్కడ ప్లాట్లు బుక్ చేసుకున్న ప్రజలు రోడ్డున పడాల్సిందేనా?
˜ ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ హైమద్కు ఎంత ముట్టింది?
˜ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న సామాజికవేత్తలు
˜ తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది
˜ జైన్ సంస్థ అక్రమాలు హైడ్రా కమిషనర్కు కనిపించడంలేదా?
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు పదే పదే తమది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రభుత్వం అంటూ ఊదరగొడుతున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు తప్పు దోవలో వెళ్తున్నారు. కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నవారు గతి తప్పి ప్రవర్తిస్తున్నారు. సామాన్య ప్రజల కడగండ్లు తీర్చాల్సిన అధికారులు గడ్డి కరుస్తుంటే ఇక సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ప్రభుత్వ పరిపాలన ఎలా సజావుగా సాగుతుంది?
సీఎం రేవంత్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ, ఆయన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ వ్యవహారంపై పూర్తి సాక్షాధారాలతో ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఘట్కేసర్ మండలం పోచారం మునిసిపాలిటీ నారపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే సర్వే నంబర్ 27, 28లో పార్క్ స్థలం ఉంది. ఖరీదైన ఈ స్థలాన్ని కొంత మంది అవినీతి అధికారులు పట్టా భూమిగా మార్చి హెచ్ఎండీఏ, రెరా అధికారులు అనుమతులు ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి హెచ్ఎండీఏ కమిషనర్కు లేఖ రాసి ఆ అనుమతులను రద్దుచేయాలని కోరారు. అయినా హెచ్ఎండీఏ కమిషనర్ హైమద్ స్పందించడంలేదని కమిషనర్ తెలిపారు. దీంతో.. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ‘జైన్ ఎస్టేట్ సంస్థ పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు’ అనే కథనం ప్రచురించింది. కథనానికి స్పందించిన పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి.. జైన్ ఎస్టేట్ సంస్థ అనుమతులను రద్దుచేయాలంటూ మరోసారి హెచ్ఎండీఏకి లేఖ రాశారు. ఇది జరిగి వారం దాటిపోయినా హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ హైమద్ కనీసం నామమాత్రంగానైనా స్పందించలేదు.

కరప్షన్ కమిషనర్గా ఈయన కలెక్షన్స్ చేస్తూ ఇలా లేఔట్ పార్కలను మాయం చేస్తున్నారు. అడ్డదారిలో అనుమతులు తెచ్చుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపారు. కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ ఇష్టానుసారంగా అనుమతులను జారీ చేస్తున్నారు. తద్వారా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే.. నారపల్లిలోని సర్వే నంబర్ 27, 28లో ఉన్న పార్కు స్థలం వ్యవహారంలో జైన్ ఎస్టేట్స్ సంస్థ చేస్తున్న నిర్మాణాలను అడ్డుకోవద్దంటూ మునిసిపల్ కమిషనర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇకపోతే.. రేవంత్ సర్కార్లో కరప్షన్ కమిషనర్ల అండతో 40 కోట్ల రూపాయల విలువ చేసే పార్క్ స్థలంలో జైన్ ఎస్టేట్ సంస్థ దర్జాగా కబ్జా చేసి భారీ నిర్మాణాలను కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని అమూల్యమైన పార్క్ స్థలాన్ని కాపాడాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

సామాన్యులపై ప్రతాపం చూపుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జైన్ సంస్థ అక్రమాలు కనిపించడంలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలు ఎక్కడైనా నిర్మాణాలు చేస్తే వెంటనే కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఇంత బాహాటంగా నిర్మాణాలు చేపడుతున్న జైన్ సంస్థపై మాత్రం ఎందుకు మిన్నకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ అక్రమ నిర్మాణాలపై కథనాలు వస్తున్నా హైడ్రా అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? వారిని కూడా సదరు హెచ్ఎండీఏ అధికారి మేనేజ్ చేస్తున్నారా? లేక, కావాలనే హైడ్రా ఇటు వైపు కన్నెత్తి చూడటంలేదా అనేది తేలాల్సి ఉంది.
