Thursday, June 5, 2025
spot_img

‘నారాయణ’ రాజ్యం.. చర్యలు పూజ్యం..

Must Read

˜ ఏకంగా ఒక జిల్లా కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..
˜ ఒకసారి అధికారులు సీజ్‌ చేసినా, తిరిగి నిస్సిగ్గుగా తెరిచిన దుర్మార్గం..
˜ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో సంఘటన..
˜ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు.. అడ్డగోలుగా ఐఐటి,
జె.ఈ.ఈ. ఫౌండేషన్‌ పేరుతో లక్షల్లో ఫీజుల వసూలు మరో ఎత్తు…
˜ ఎవరి ప్రోద్బలంతో సీజ్‌ చేసిన పాఠశాలను తిరిగి తెరిచారో తెలియాలి
˜ ప్రభుత్వ గురుకులాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటిని మూసేస్తూ…
కార్పొరేట్‌ కల్చర్‌ను ప్రోత్సహిస్తోందా..?
˜ నారాయణ విద్యా సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలి..
˜ నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లల్లో అందించాలంటున్న మేధావులు..

ఆయన ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడు. మంత్రిగా వెలిగిపోతున్నాడు. ఆయన సారథ్యంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఆయన విద్యా సంస్థలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? అనే అనుమానం కలగక మానదు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే మంత్రి నారాయణ. ఇబ్బడిముబ్బడిగా నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఇక్కడ సీట్‌ కావాలంటే హై లెవల్ రికమండేషన్‌ ఉండాలి. లక్షల్లో ఫీజు చెల్లించాలి. విద్య, వైద్యం ప్రతి ఒక్కరి జన్మ హక్కు. కానీ ఆ హక్కును కాలరాస్తున్నాయి నారాయణ విద్యా సంస్థలు.

ఈ సంస్థల్లో పేరుకుపోయిన అవినీతి మురికిని తొలగించడం ఎవరికీ సాధ్యపడటం లేదు. నిజంగా సాధ్యపడటం లేదా? లేక, లొంగిపోతున్నారా అనేది మేధావులు అడుగుతున్న ప్రశ్న. జవాబు ఎక్కడుందో తెలియడం లేదు. అనుమతులు లేకుండా విద్యా సంస్థలు నిర్వహించడం, తప్పనిసరి పరిస్థితుల్లో సీజ్‌ చేస్తే ఎలాంటి బెరుకూ లేకుండా తిరిగి తెరవడం, చిన్నచిన్న తరగతులకే లక్షల్లో ఫీజులు వసూలుచేయడం నారాయణ విద్యా సంస్థల్లో కామన్‌గా జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందో అర్థంకావడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌‌లో చంద్రబాబు క్యాబినెట్‌లో నారాయణ మంత్రిగా కొనసాగుతున్నాడు. సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అనుమతిలేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం నారాయణ విద్యా సంస్థల అధిపతి కోసం ప్రత్యేకంగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సైట్‌ ఓపెన్‌ చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఒక ఘటనను ఇప్పుడు చూద్దాం..

నారాయణ విద్యా సంస్థల కొత్త స్కూల్‌ పర్మిషన్‌ కోసం స్పెషల్‌గా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సైట్‌ ఓపెన్‌ చేశారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీ ఆగడం లేదు. కట్టడి కావడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో కార్పొరేట్‌ విద్యా సంస్థ అయిన నారాయణ హైస్కూల్‌ను‌ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్నారు. మరీ దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐఐటి, జేఈఈ ఫౌండేషన్‌ పేర్లతోనూ చిన్న తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అని ఊదరగొడుతూ స్థానిక ప్రజలను ఆకర్షిస్తూ ఒక్కో అడ్మిషన్‌కి సుమారు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది.

విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి ఈ వ్యవహారంపై మండల అధికారికి ఫిర్యాదు చేశారు. మండల అధికారి సంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారికి సమాచారమిచ్చి పాఠశాలను సీజ్‌ చేసి అనంతరం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే పాఠశాలను సీజ్‌ చేసిన ఒక వారం రోజుల తర్వాత మళ్లీ తెరిచారు. ఇక్కడ అర్థకాని విషయం ఏంటంటే ప్రభుత్వాధికారులు సీజ్‌ చేసిన ఒక ప్రైవేట్‌ పాఠశాలను ఇంత ధైర్యంగా ఎవరి ప్రోద్బలంతో తెరిచారో అనే మీమాంశతో నిజానిజాలు తెలుసుకునేందుకు వారు తిరిగి మండల విద్యా శాఖ అధికారికి, సంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. కానీ వారు మాత్రం ఈ నారాయణ కార్పొరేట్‌ విద్యా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారని తెలిసిపోయింది.

కాగా.. ఒక పక్క రైట్‌ టు ఎడ్యుకేషన్‌ చట్టం అమలుకాక బడుగు, బలహీనవర్గాలు నాణ్యమైన విద్యను అందుకోలేక, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చదువుకోలేక, అక్కడ చదువును కొనుక్కోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో సమాజంలో నిరుద్యోగులుగా, ఫోర్త్‌ గ్రేడ్‌ ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా దురదృష్టం. ‘1986 రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌’ ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. కానీ అధికారులు, కార్పొరేట్‌ వ్యవస్థ కలిసి దాన్ని అమలుచేయకుండా తుంగలో తొక్కుతున్నారు. అయితే.. ఖచ్చితంగా, రాజ్యాంగబద్ధంగా తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందాలని మేధావులు సూచిస్తున్నారు. ఇక మరీ దురదృష్టకరమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో దాదాపు 12 సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలను మూసివేస్తున్నట్లు మనం అందరం పత్రికల్లో చూశాం.


ఒక పక్క అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా వెనకడుగు వేస్తున్న అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య సలహాదారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు కార్పొరేట్‌ విద్యా సంస్థ అధిపతి మెప్పు కోసం తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు‌ను తాకట్టు పెడతారా అని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్య అందేలా చూసే ప్రభుత్వం ఎక్కడుంది? ఎప్పుడొస్తుంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుర్తింపులేని పాఠశాలలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ‘ఆదాబ్‌’ సూచిస్తోంది.

Latest News

ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ క్యాబినెట్ ఇవాళ (జూన్ 5న గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS