గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం (2025 మే 30న) పాతబస్తీలో పర్యటించారు. చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్లో జరుగుతున్న నాలా పనులను పరిశీలించారు. వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలానా కా చిల్ల, గంగా నగర్ నాలాలను కూడా చూశారు.

మౌలానా కా చిల్ల, గంగా నగర్ నాలాల వల్ల పలు కాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్.. కమిషనర్కు వివరించారు. గంగా నగర్ నాలా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికి 70 శాతం పూర్తయ్యాయని ప్రాజెక్టు ఈఈ బీఎల్ శ్రీనివాస్.. కమిషనర్కు తెలిపారు. మిగతా 30 శాతం పనులను తొందరగా పూర్తిచేయాలని కమిషనర్.. ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. గంగా నగర్ నాలాకు ఇరువైపులా జల మండలి పైప్ లైన్ సమాంతరంగా ఉంది. అందువల్ల జీహెచ్ఎంసీ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ వింగ్, జల మండలి అధికారులు కలిసి క్లీన్ చేయాలని సూచించారు. జహంగీర్ నగర్ కాలనీ నుంచి మౌలానా కా చిల్ల నాలా వరకు డ్రైనేజీ కాలువను నిర్మించాల్సిన అవసరాన్ని కార్పొరేటర్.. కమిషనర్కు చెప్పగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్, జల మండలి ఎండీ అశోక్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ప్రాజెక్టు ఈఈ బీఎల్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, పత్తర్గట్టి కార్పొరేటర్ సోహెల్ మహమూద్ ఖాద్రీ, డబీర్పుర కార్పొరేటర్ అలందార్ హుస్సేన్ ఖాన్, రెయిన్ బజార్ కార్పొరేటర్ వాసా ఉద్దీన్, సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, తలాబ్ చంచలం డాక్టర్ సమీనా బేగం, మొఘల్పుర కార్పొరేటర్ నస్రీన్ సుల్తానా, కుర్మగూడ కార్పొరేటర్ షఫత్ అలీ తదితరులు ఉన్నారు.