తాజాగా 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం (2025 మే 30న) 17 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ చేయూత’కు ఆకర్షితులై జిల్లా ఎస్పీ సమక్షంలో సరెండర్ అయ్యారు. ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81 మరియు 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా అందిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకున్నామని చెప్పారు. నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రకటించారు.
రివార్డులు:
జన జీవన స్రవంతిలో కలిసిన అజ్ఞాత సాయుధ దళ మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసు శాఖ వెంటనే తగిన రివార్డును అందజేస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారంతో అవసరమైన దీర్ఘకాలిక పునరావాస చర్యలు కూడా తీసుకుంటారు. మావోయిస్టు అజ్ఞాత సాయుధ దళాల సభ్యులు తెలంగాణ ప్రాంతంలో సంచరిస్తే తాము తీసుకునే చట్టపరమైన చర్యల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని పోలీసులు ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికి 282 మంది:
2025 జనవరి నుంచి ఇప్పటివరకు (ఈ 17 మందితో కలిపి) మొత్తం 282 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్టు) సాయుధ దళాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అందువల్ల ఆయా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు దళాలకు సహకరించకూడదని పోలీసులు హెచ్చరించారు. మావోయిస్టుల సమాచారం తెలిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గానీ జిల్లా ఉన్నతాధికారులకు గనీ తెలియజేయాలని సూచించారు. ఇలా ప్రజలు అందించిన సమాచారం ద్వారానే ఇటీవల ములుగు జిల్లాలో 20 మంది సాయుధ దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే.. 12 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
చికిత్స కన్నా నివారణ మేలు:
ఇటీవల కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. మావోయిస్టులకు తెలంగాణ ఎప్పటికీ ఆశ్రయం కాజాలదు అని పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులని, వాళ్లు కాలం చెల్లిన, ఆచరణాత్మకంకాని సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకునే రోజలు ఎప్పుడో పోయాయని తేల్చిచెప్పారు. మావోయిస్టులకు ఇప్పుడు చావోరేవో కన్నా నివారణే మేలు అని గ్రహించాలి. అజ్ఞాత దళ సభ్యులు, వారికి సహకరించే మిలీషియా, ఆర్పీసీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జవజీవనంలో కలిసిపోవాలని పోలీసులు తమ ప్రకటనలో ఆహ్వానించారు.