బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకునే విషయంలో తస్మాత్ జాగ్రత్త అని ఆ దేశంలోని తమ ప్రజలను చైనా హెచ్చరించింది. ఈ మేరకు చైనా ఎంబసీ సూచనలు జారీ చేసింది. కళ్యాణం కుంభకోణాలు పెచ్చుమీరుతుండటంతో ఇలాంటి ఆలోచనలు చేయొద్దని సలహా ఇచ్చింది. ఇతర దేశాల యువతులను భార్యలుగా చేసుకునేందుకు కొనుగోళ్లకు పాల్పడొద్దని, అక్రమ పెళ్లిళ్లకు ఆమడ దూరంలో ఉండాలని హితవు పలికింది. చైనాలో ఇటీవల వధువుల అక్రమ రవాణా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సర్కార్ ఈ వార్నింగ్ ఇచ్చింది. చైనా ఈమధ్య వరకు ఒకే సంతానం అనే విధానాన్ని అమలుచేసింది. దీంతో సుమారు మూడు కోట్ల మంది చైనా మగవాళ్లు జీవిత భాగస్వామి దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పెళ్లికూతుర్లకు గిరాకీ నెలకొంది. ఇదే సందు అని మ్యారేజ్ ముసుగులో బంగ్లాదేశ్ లేడీస్ని చైనాకు అడ్డదారుల్లో తరలిస్తున్నారు. ఈ ఘటనలకు చెక్ పెట్టేందుకు లేటెస్ట్గా అడ్వైజరీ విడుదలైంది.