కరోనా మరోసారి ఎంట్రీ ఇవ్వటంతో పాటించాల్సిన జాగ్రత్తలను ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ అనేది ప్రస్తుతం పూర్తిగా నశించిపోయిందని తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఎంసీ1.10.1, ఎల్బీ1.3.1, ఎల్ఎఫ్7 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వాటి నుంచి వచ్చిన జేఎన్.1, ఎల్పీ 8.1, ఎక్స్ఎఫ్పీ, ఎక్స్ఈసీ వేరియంట్లే ఇప్పుడు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ఇందులోనూ ఎల్పీ 8.1 వేరియంటే 70 శాతం వ్యాపిస్తోందని స్పష్టం చేశారు. ఈ వేరియంట్ల వల్ల ప్రమాదమేమీ లేదని రాజారావు వివరించారు.

కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవి.. ఎక్కువ కాలంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు, వయసులో పెద్దోళ్లు, చిన్నారులు, గర్భిణులు అలర్ట్గా ఉండాలి. ప్రస్తుతం వానలు పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పడిశం, దగ్గు లాంటివి ఎటాక్ చేస్తుంటాయి. అందువల్ల ఆందోళన చెందొద్దు.

ఒకవేళ ఇవి కాకుండా ఒంటి నొప్పులు ఇబ్బంది పెడుతున్నా, నీరసంగా అనిపించినా కరోనా టెస్ట్ చేయించుకోవటం బెటర్. కొవిడ్ పాజిటివ్ అని వస్తే ఐసోలేషన్లో ఉండాలి. వైద్యుల సలహాలు సూచనల మేరకు మందులు వేసుకోవాలి.