Sunday, June 1, 2025
spot_img

భూదాన్‌ భూమి.. సమర్పయామి!

Must Read

శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్‌ హాల్‌పై భూదాన్‌ యజ్ఞ బోర్డు నిర్ధారణ
సర్వే నంబర్‌ 206లో 4 ఎకరాల 29 గుంటల భూదాన్‌ భూమిగా నిర్ధారించిన భూదాన్‌ యజ్ఞ బోర్డు సర్వే నం.206(ఏ)లో 1 ఎకరం 30 గుంటలు సామ శ్రీనివాస్‌ రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌ ఆక్రమణలో
˜ సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు
కబ్జాలను తొలగించాలని తుర్కయంజాల్‌ మునిపల్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు మునిసిపల్‌ కమిషనర్‌ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న వైనం
వెంటనే భూదాన్‌ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌

‘నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా బయటపడుతుంది’ అన్నట్లుగా 2025 మార్చి 5న భూదాన్‌ యజ్ఞ బోర్డు కార్యాలయానికి తాహశీల్దార్‌ సమర్పించిన ఒక లేఖ బోర్డు భూముల కబ్జాపై కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 206లో ఉన్న భూదాన్‌ భూమి కబ్జాకు గురైందని భూదాన్‌ యజ్ఞ బోర్డు ధృవీకరించింది. ఈ భూమిని కాపాడాలని స్థానికులు జిల్లా కలెక్టర్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కబ్జా బాగోతంపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వరుస కథనాలను ప్రచురించింది. ఈ కథనాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం భూదాన్‌ యజ్ఞ బోర్డు రికార్డులను పరిశీలించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సర్వే నంబర్‌ 206లో భూదాన్‌ భూమి

భూదాన్‌ యజ్ఞ బోర్డు నివేదిక ప్రకారం సర్వే నంబర్‌ 206లో 4 ఎకరాల 29 గుంటల భూమి భూదాన్‌ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. ఈ భూమిని పగడిమర్రి అనంతయ్య తండ్రి జోషి కిష్టయ్య దానం చేసినట్లు స్పష్టమైంది.

కబ్జా వివరాలు

తహశీల్దార్‌ నివేదిక ఆధారంగా 1100 గజాల్లో 7 ఇళ్లు, 480 గజాల్లో 4 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్లు తేలింది. సామ శ్రీనివాస్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌.. 1 ఎకరం 30 గుంటల భూదాన్‌ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు, అలాగే వెంకటేశ్వర హేచరీస్‌.. 18 గుంటల భూదాన్‌ భూమిని కబ్జా చేసినట్లు స్పష్టమైంది.

కలెక్టర్‌ ఆదేశాలు-చర్యల్లో జాప్యం

కబ్జాలను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తుర్కయంజాల్‌ మునిసిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. మునిసిపల్‌ కమిషనర్‌ కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సామ శ్రీనివాస్‌ రెడ్డి భూదాన్‌ భూమిని కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నాడని, ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నాడని, ప్రభుత్వ అధికారులపై తప్పుడు కౌంటర్లు దాఖలు చేస్తున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో భూదాన్‌ యజ్ఞ బోర్డు భూముల కబ్జాకు సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఇవీ..

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ప్రమేయం ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూముల కబ్జా వివాదం. ఇది.. సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములకు సంబంధించింది.

ఆరోపణలు

ఈ కొనుగోళ్లు అక్రమంగా జరిగాయని, భూదాన్‌ బోర్డు భూములను ప్రైవేట్‌ వ్యక్తులు తమ పేరిట, కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. కొనుగోలు కోసం రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ లావాదేవీల్లో పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని, దీనిపై విజిలెన్స్‌ విచారణలు జరిగాయని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసులు నమోదు చేసిందని వార్తలు వచ్చాయి.

కోర్టు జోక్యం

ఈ భూదాన్‌ భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలని, సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీర్ల మల్లేష్‌ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జస్టిస్‌ సి.వి.భాస్కర్‌ రెడ్డి విచారణ చేపట్టి ప్రాథమికంగా రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ భూములు భూదాన్‌ బోర్డుకు చెందినవని తేల్చింది. పిటిషన్‌లో ఉన్నత అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని భావించి ఆ సర్వే నంబర్లలోని భూములను కేసు విచారణ ముగిసేదాక నిషేధిత జాబితాలో చేర్చాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని ఆదేశించింది.

స్థానికుల డిమాండ్‌

తుర్కయంజాల్‌లోని కోట్ల రూపాయల విలువైన భూదాన్‌ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే జోక్యం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టి భూదాన్‌ భూముల పరిరక్షణకు మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నారు.

Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS