ఏసీబీ వలకు మరో అవినీతి ఆఫీసర్ చిక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగానికి చెందిన అచ్యుతాపురం సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆమెతోపాటు కాలేశ్వరి పార్సిల్ ఇన్ఛార్జ్ సన్యాసిరాజ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ విషయాలను ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ ప్లైవుడ్ను విశాఖపట్నానికి సప్లై చేశాడు. దీనికి సంబంధించిన క్యారియర్ ఇన్వాయిస్ లేకపోవటంతో అతని నుంచి రూ.30 వేలు వసూలు చేయాలని జయలక్ష్మి భావించారు. డబ్బును సన్యాసి రాజ్కి ఇవ్వాలని సూచించారు. బాధితుడు ఏసీబీకి విషయం చెప్పడంతో వారు రంగ ప్రవేశం చేసి రూ.25 వేలు ఇస్తుండగా రైడ్ చేసి దొరకబుచ్చుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
