˜ ఎంచక్కా ముంబై చెక్కేశాడు ..?
˜ వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం..
˜ 20 కోట్లతో ఏజెంట్ డేనియల్ విక్టర్ పరార్
˜ అతనికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫణింద్ర సహకారం
˜ అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్
˜ చీటర్, ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరి నివాసాలూ ఒక చోటే
˜ వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్ మకాం మార్పు..
˜ గతంలో బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి ఫణింద్ర
˜ డానియల్ పరార్ కావడంతో మాట మార్చిన ఉద్యోగి.. లబోదిబోమంటున్న బాధితులు

జోసెఫ్ డేనియల్ విక్టర్ అనే ఓ తమిళవాసి వీసాల పేరిట భారీ మోసానికి తెగబడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.20 కోట్లు వసూలు చేసి ముంబైకి చెక్కేశాడు. ఇతను గ్లోబల్ పాత్ వే ఎడ్యుకేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనే సంస్థను హైదరాబాద్ సోమాజిగూడలోని బౌలేవార్డ్ బిల్డింగ్లో స్థాపించాడు. దాని ద్వారా ఆస్ట్రేలియా, కెనడా, యు.ఎస్ వంటి దేశాలకు వర్కింగ్ వీసా పేరుతొ పంపుతాననని మాయమాటలు చెప్పాడు.

తద్వారా వందలాది మంది అమాయక యువతను ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మభ్యపెట్టాడు. వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి చివరికి హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చాడు. అతని మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు చేసేది లేక లబోదిబో అంటున్నారు. సిటీలో సగానికి పైగా విదేశీ కన్సల్టెన్సీలు అమాయక యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి.

ఇవి వీసా ప్రాసెస్ పేరుతొ చేస్తున్న తతంగమంతా ఫేక్ అని చెప్పొచ్చు. వీటిలో చాలా వరకు అబ్రాడ్ కన్సల్టెన్సీలు అబ్రాడ్లో ఏదైనా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇప్పించి వీసా ప్రాసెస్ చేస్తుంటాయి. ఈ ప్రాసెస్లో వీసా క్లియర్ అయిన సందర్భాలు వందలో ఒకటీ రెండుకు మించి ఉండవు. వీటినే సాకుగా చూపించి ఫీడ్ బ్యాక్ పేరుతొ విదేశాలకు వెళ్లాలనుకునే అమాయక యువతను దోచుకుంటున్నారు.
గతంలోనూ ఇదే తరహా మోసం:
నిజామాబాద్ జిల్లాలో షేక్ బషీర్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఆర్.కె.ట్రావెల్స్ పేరుతో గల్ఫ్ ఏజెంట్ అవతారమెత్తాడు. గల్ఫ్ దేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు. తనను నమ్ముకున్న వారికి ఏ కష్టాలూ రాకుండా చూసుకుంటానని చెప్పాడు. అది నమ్మిన నిరుద్యోగులు కొందరు అతనికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఐదు(నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, హైదరాబాద్) జిల్లాలకు చెందిన 500 మందికి పైగా ఆశావహుల నుంచి డబ్బు కట్టించుకున్నాడు. అంతేకాదు.. సంబంధిత వ్యక్తుల పాస్ పోర్టులను తీసుకొని మెడికల్ పరీక్షలు చేయించి త్వరలోనే వీసాలు ఇస్తామని నమ్మించాడు. సుమారు వంద మందికి ఒక గ్రూప్ చొప్పున కొన్ని గ్రూప్లను తయారుచేశాడు.
ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వరకు వసూలు చేశాడు. గల్ఫ్ పంపిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. నకిలీ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒక్కొక్క నిరుద్యోగి రూ.50 వేల చొప్పున కట్టారు. రూ.2 కోట్లు జేబులో వేసుకొని బోర్డు తిప్పేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బాధితులు ట్రావెల్ ఆఫీసుకి వెళ్లగా అక్కడ కూడా తాళం వేసి ఉండటంతో మోసపోయామని గ్రహించారు.
చివరకి డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. కడుపు కొట్టుకొని సంపాదించిన డబ్బు పోయిందంటూ కొందరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరికొందరు అప్పు చేసి డబ్బు కట్టామంటూ గుండెలు బాదుకుంటున్నారు.
జోసెఫ్ డేనియల్ విక్టర్ మోసానికి ఫణింద్ర ప్రసాద్ సహకారం!
కె.ఫణింద్ర ప్రసాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాంపల్లి విభాగంలో సీనియర్ అసిస్టెంట్. ఇతనికి జోసెఫ్ డేనియల్ విక్టర్ దోస్త్. ఇది ఎవరో చెప్పింది కాదు. స్వయంగా కె.ఫణింద్ర ప్రసాదే చెప్పాడు. మూడు నెలల క్రితం తాము మోసపోయామని గుర్తించిన కొంత మంది యువకులు, విద్యార్థులు గ్లోబల్ పాత్ వే ఎడ్యుకేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్లో జోసెఫ్ డేనియల్ విక్టర్తో గొడవకు దిగారు.

దీంతో.. కె.ఫణింద్ర ప్రసాద్ ఆగమేఘాల మీద అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు భరోసా ఇచ్చాడు. జోసెఫ్ డేనియల్ విక్టర్ తనకు దోస్త్ అని, మంచి వ్యక్తి అని, మీ డబ్బులను అతను తప్పకుండా తిరిగి ఇస్తాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. మీకు నమ్మకం లేకపోతే తన చెక్ ఇస్తానని కూడా చెప్పుకొచ్చాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నానని, తనపై పూర్తి నమ్మకం ఉంచాలని కోరాడు. ఈ మేరకు తన జాబ్ ఐడీ కార్డుతోపాటు ఆధార్ కార్డును కూడా బాధితులకు ఇచ్చాడు. దీంతో శాంతించిన బాధితులు కొంతకాలం ఎదురుచూశారు.
ఈ మధ్య తమ డబ్బు కోసం జోసెఫ్ డేనియల్ విక్టర్కు ఫోన్ చేయగా రేపు మాపు అని చెబుతూనే ఒక మహిళా అడ్వకేట్తో రాయబారం కొనసాగించాడు. ఆమె కూడా మాట నిలబెట్టుకోలేక చేతులేత్తిసింది. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను, కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.