Monday, June 2, 2025
spot_img

హైడ్రానే హడలెత్తిస్తున్న సంస్థ

Must Read

˜ పుప్పాలగూడలో దర్జాగా కబ్జా చేస్తున్న వెస్టర్న్‌ నిర్మాణ సంస్థ
˜ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
˜ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి
˜ భారీగా ముడుపులు తీసుకొని ఎన్వోసీ జారీ చేసిన నాటి రంగారెడ్డి కలెక్టర్‌
˜ ఇటీవల భూదాన్‌ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు చేసిన ఈడీ
˜ ఇదే తరహాలో పుప్పాలగూడలో సైతం రికార్డుల ట్యాంపరింగ్‌ చేసిన వెస్ట్రన్‌ నిర్మాణ సంస్థ
˜ ఈ వ్యవహారంలో నాటి కలెక్టర్‌, ఆర్డీఓలు చక్రం తిప్పారంటూ ఆరోపణలు
˜ ముమ్మాటికి ఇది ప్రభుత్వ భూమేనని తేల్చిచెప్పిన విజిలెన్స్‌
˜ నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తుల పైన, బాధ్యులైన అధికారుల పైన వెస్ట్రన్‌ నిర్మాణ సంస్థ యాజమాన్యం పైన గండిపేట తహశీల్దార్‌ పోలీస్‌ స్టేషన్‌లో‌ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
˜ కాసులకు కక్కుర్తి పడి అక్రమంగా ఇచ్చిన హెచ్ఎండీఏ అనుమతిని రద్దు చేయాలి
˜ దొడ్డి దారిన పొందిన రెరా అనుమతులను రద్దు చేసి బ్లాక్‌ లిస్టులో పెట్టాలి
˜ అమాయకులు నష్టపోకుండా హైడ్రా చర్యలు చేపట్టాలి
˜ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిలో సైన్‌ బోర్డు ఏర్పాటుచేయాలి
˜ ఈ వ్యవహారంలో చేతులు మారిన కోట్ల రూపాయలు
˜ ఈ అవినీతిపై ఏసీబీ, ఈడీ, విజిలెన్స్‌ దృష్టి సారించాలని డిమాండ్

అక్రమ నిర్మాణదారుల గుండెల్లో గుబులు రేపిన హైడ్రా వ్యవహారం మనం చూశాం. అయితే అలాంటి హైడ్రాకే పెను సవాల్‌ విసురుతోంది ఒక నిర్మాణ సంస్థ. భారీ భూకబ్జాకు తెరలేపి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టింది. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కొరడా ఝళిపించే హైడ్రా.. ఈ సంస్థ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేకపోతోంది? సామాన్యుల గుండెల్లో నిద్రపోయే హైడ్రా రంగనాథ్‌కు‌ కూడా కునుకులేకుండా చేస్తోంది వెస్టర్న్‌ విండ్సర్‌ పార్క్‌ అనే నిర్మాణ సంస్థ. ఏమాత్రం భయంలేకుండా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని కొల్లగొడుతోంది. ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించింది. దీనికోసం కోట్ల రూపాయలు చేతులు మారటం సంచలనం సృష్టిస్తోంది. అధికారులు ఇటువైపు ఎందుకు దృష్టిపెట్టడం లేదు? హైడ్రా సైతం ఎందుకు మిన్నకుండిపోతోంది? ఈ భారీ కబ్జా వ్యవహారం వెనక ఎవరున్నారు? అన్నది పలువురి మెదళ్లను తొలుస్తున్న జవాబు లేని ప్రశ్న.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామం పరిధిలోని వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ అనే నిర్మాణ సంస్థ భారీ భూకబ్జాకు తెరలేపింది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలను సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత జాబితాలోని భూమిని దర్జాగా కబ్జా చేశారనే ప్రచారం బహిరంగంగా సాగుతోంది. భారీఎత్తున ముడుపులు తీసుకొని నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్ ఏన్వోసీ జారీ చేశాడనే ఆరోపణలు సైతం వినిపిస్తు న్నాయి. ఇటీవలే భూదాన్‌ భూముల రికార్డులను ట్యాంపర్ చేసిన వ్యవహారంలో పలువురు వ్యక్తుల పైన, అధికారుల పైన ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే తరహాలో పుప్పాలగూడలోనూ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ అనే సంస్థ యాజమాన్యం, కొందరు అధికారులు కలిసి రికార్డులను ట్యాంపర్ చేసి, ప్రభుత్వ భూమిని కబ్జా చేయటానికి కుయుక్తులు పన్నారని తెలుస్తోంది.

నాటి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎన్‌ఎస్‌ హరిహారన్‌ జారీ చేసిన జీఓలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది. వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ అనే నిర్మాణ సంస్థ ప్రైవేట్ భూమిగా చూపిస్తున్న సర్వే నంబర్‌.. ప్రభుత్వ భూమిగా చూపిస్తున్న ఈ జీఓలోని సర్వే నంబర్‌ ఒక్కటే అని అర్థమవుతుంది. దీన్నిబట్టి రికార్డులు ట్యాంపర్ అయ్యాయనే ఆరోపణలు ముమ్మాటికీ వాస్తవమని స్పష్టమవుతోంది. ఇటీవలే విజిలెన్స్‌ అధికారుల విచారణలోనూ ప్రభుత్వ భూమే అని తేటతెల్లమైంది.

ఇది ముమ్మాటికి కబ్జా చేసిన స్థలంలోని నిర్మాణమేనని విజిలెన్స్‌ తేల్చి చెప్పింది. వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులోని ప్లాట్లను అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అంటగట్టి కోట్లు కొల్లగొడుతుండటం అధికారుల కళ్లకు కనపడటం లేదా అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు పొరపాటున కబ్జా చేసినా, తెలిసీ తెలియక ప్రభుత్వ భూములను కొనుక్కొని నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఈ వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ అనే నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జా వ్యవహారం పెను సవాలుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అమాయక ప్రజలను అప్రమత్తం చేసి నష్టపోకుండా తక్షణమే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సైన్‌ బోర్డును ఏర్పాటుచేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న బడా నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్లు‌ వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి రికార్డులు ట్యాంపర్ చేస్తే కేసులు పెట్టాల్సిన గండిపేట తహశీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి.. వెస్టర్న్‌ విండర్స్‌ పార్క్‌ నిర్మాణ సంస్థ యాజమాన్యం పైన గానీ, రికార్డుల ట్యాంపరింగ్‌లో సహకరించిన అధికారుల పైన గానీ పోలీస్‌ స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ నిస్సిగ్గుగా దొడ్డిదారిన ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వ భూమి అని తెలిసినా సదరు నిర్మాణ సంస్థకు రెరా అనుమతి ఎలా సాధ్యమైంది? అని సామాజికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. వెస్టర్న్‌ నిర్మాణ సంస్థ చేస్తున్న ఈ కబ్జా వ్యవహారంలో గత కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, ఆర్డీఓ చంద్రకళ చక్రం తిప్పినట్లు వస్తున్న ఆరోపణల పైన, అధికారుల పాత్ర పైన, ఇక్కడ జరిగిన లావాదేవీల పైన ఈడీ, విజిలెన్స్‌, ఏసీబీ విచారణ జరిపితే కళ్లు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలవుతాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. వెస్టర్న్‌ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో, తహశీల్దార్‌, రెరా, హెచ్‌ఎండీఏ, టీఎస్ఐఐసీ కార్యాలయాల కేంద్రంగా జరిగిన అక్రమాలను, అధికారుల పాత్రను మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్‌ హైదరాబాద్’.‌ ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS