- లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
- ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
- అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
- విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున అందాల్సిన రివార్డులను అందిస్తామని మల్టీజోన్1 ఐజి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పోలీస్హెడ్క్వాటర్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన 64మంది మావోయిస్టు దళసభ్యులు శనివారం లొంగిపోయారని, వీరిలో 48మంది పురుషులు, 16మంది మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరిలో ఎసిఎం1, పార్టీమెంబర్లు 10, ఆర్పిసి కమిటీ 9, ఆర్పిసి మిలటరీ 19మంది ఆర్పిసి డిఎకెఎంఎస్/కెఎంఎస్ 11మంది, ఆర్పిసి సిఎన్ఎం 6మంది, ఆర్పిసి జిఆర్డి 8మంది పోలీస్ అధికారులకు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున రూ.25వేల నగదును అందించామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబాలకు రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.సమాజంలో ప్రశాంతజీవితం గడిపేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రామాల్లో యువతకు విద్యా, ఉపాధి, క్రీడలు, వ్యవసాయం, వ్యాపారాలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధక్యాడర్లో ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపారు. గడిచిన రెండున్నర నెలలకాలంలో మొత్తం 122మంది నిషేధిత మావోయమిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన అనంతరం వారికి అందాల్సిన ప్రతిఫలాలను కూడా తక్షణమే అందే విధంగా పోలీస్శాఖ కృషి చేస్తుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్రాజ్, భద్రాచలం ఎఎస్పీ విక్రాంత్, సిఆర్పిఎఫ్ అధికారులు రితేష్ఠాకూర్ తదితరులు పాల్గన్నారు.