- నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్
ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం శివారు చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చాం. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులను మనం మర్చిపోలేం. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరినీ పవన్ గౌరవించారు. కష్టపడి యువతరాన్ని నాయకత్వంగా మార్చాలని చెప్పారు. జనసేనలో ప్రస్తుతం 12.32 లక్షల మంది సభ్యులున్నారు. ప్రతిపక్షంలో ఒక విధంగా.. అధికారంలో ఉండగా మరో విధంగా లేము. రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్ ఎదగాలి. జనసేన ఎప్పుడూ సామాన్యుల పక్షానే నిలబడుతుంది. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందేలా జన సైనికులు కృషి చేయాలి. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగాం. పదవులు వచ్చినా రాకున్నా పార్టీకి అండగా ఉందాం. మన పోరాటంలో 463 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన జనసైనికులకు పవన్ అండగా ఉన్నారు. మన అడుగులు ఎప్పుడూ సామాన్యుడివైపే నడుస్తాయి‘ అని నాదెండ్ల అన్నారు.