- శ్రీనివాస్రెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన తర్వాత చర్యలు చేపట్టని కలెక్టర్
- తుర్కయంజాల్లో కబ్జాకోరులకు అధికారుల సపోర్ట్
- సర్వే నెంబర్ 206లో 4 ఎకరాల 29 గుంటలు భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ యజ్ఞబోర్డ్
- సర్వే నెం.206(అ)లో 1 ఎకరం 30 గుంటలు మాయం
- సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణించిన రెవెన్యూ అధికారులు
- కబ్జాలను తొలగించాలని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ ఆదేశాలు
- మున్సిపల్ కమిషనర్ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న వైనం
- వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు దొంగలకు సద్ది మోస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమాలు, అవినీతిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? అన్నట్లు ఉంది అధికారులు తీరు. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, దేవాదాయ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడ్నే అర్థం చేసుకోవచ్చు. తప్పు చేశారని రుజువు అయినప్పటికి వారిపై చర్యలు తీసుకు నేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో.. లేదంటే అధికారులు ఎంత డబ్బు ముట్టిందోనన్న డౌట్ రాకమానదు. ‘ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?’ అన్న సామెతను నిజం చేస్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇటు అక్రమార్కులు నీకింత, నాకింత అని పంచుకొని భూములను కొల్లగొడుతుంటే నడిమిట్ల ఈ జనానికెందుకో అనుకుంటున్నారు కొందరు అధికారులు.
వివరాలోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్, కమ్మగూడ గ్రామం సర్వే నెం. 206(అ) ఎకరం 30గుంటల భూదాన్ భూమి కబ్జాకు గురైంది. అత్యంత కాస్ట్లీ అయిన భూదాన్ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 45 కోట్లు ఉంటుంది. ఇంత విలువైన భూదాన్ భూమిని కబ్జా చేసి, నిర్మాణం చేపట్టినట్లు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైనవి.. దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సమగ్రంగా దర్యాప్తు చేసి భూదాన్ భూమిగా నిర్ధారించారు. అంతేకాకుండా సర్వే నెంబర్ 206లో 4 ఎకరాల 29 గుంటలు భూదాన్ భూమి ఉన్నట్లు భూదాన్ యజ్ఞబోర్డ్ అధికారులు (లెటర్ నెం. B1/1048/63/Dated 23 march 1963) రికార్డు ప్రకారం నిర్దారించడం జరిగింది. ఇట్టి భూమిని భూమిలేని నిరుపేదలకు కేటాయించాలన్న మంచి ఉద్దేశ్యంతో పగిడిమర్రి అనంతయ్య (తండ్రి కిష్టయ్య) భూదాన్ యజ్ఞబోర్డుకు దానం చేయడం జరిగింది. కానీ, కొందరు అక్రమార్కులు అట్టి భూమిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేసినట్లు తెలుస్తుంది. తహసీల్దార్ నివేదిక ఆధారంగా 1100 గజాలలో 7 ఇండ్లు నిర్మాణం, 480 గజాలలో 4 ఇండ్లు నిర్మాణం జరుగుతున్నట్లు, సామ శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల ఎకరం 30 గుంటలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు, వెంకటేశ్వర హేచరీస్ 18 గుంటల్లో భూదాన్ భూమిని కబ్జాలో ఉన్నట్లు స్పష్టమైన నివేదికను కలెక్టర్కు సమర్పించడం జరిగింది.
భూదాన్ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్కు రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ 12వ తేది మార్చిన సామ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కానీ, నేటి వరకు కూడా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. గతంలో ఉన్న తహసీల్దార్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ విధుల నిర్లక్ష్యం వల్ల సుమారు రూ.45కోట్ల విలువైన భూదాన భూమి అక్రమార్కుల పాలైంది. ఈ అక్రమాలను గుర్తించిన ప్రస్తుత తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భూదాన్ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..