- టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను
- అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక
- పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
- కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ … బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయని తెలిపారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.15 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. సివిల్స్, గ్రూప్స్ రాసేవారికి అండగా ఉన్నామన్నారు. అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బ్యాచ్కు 500 మందికి చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. నేతన్నలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇల్లు కట్టుకునే వెనుకబడిన వర్గాలకు అదనంగా రూ.50వేలు ఇస్తామన్నారు. ఎస్సీల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ మంజూరు చేస్తున్నామని చంద్రబాబు ప్రసంగించారు.
మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో భాగంగా సీఎం అక్కడికి వెళ్లారు. గ్రామంలో కులవృత్తులు చేసుకునేవారి ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటితో పాటు ఆయన పశువుల పాకను పరిశీలించారు. అనంతరం బీసీ వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలను చంద్రబాబు పరిశీలించి ఆయనతో మాట్లాడారు. జగన్నాథం ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన కిట్ను ఆయనకు సీఎం బహూకరించారు. అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో యాదవ సంఘం నేతలు సీఎంకు గొర్రె పిల్లను బహూకరించారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు పార్థసారథి. సవిత, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.