- కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు
- తరచూ జరుగుతున్న ప్రమాదాలు
- ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు
పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మూలమలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల వెంట కంపచెట్లు విపరీతంగా పెరిగి, దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపుల వద్ద జరిగే ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మితిమీరిన వేగం, మలుపు వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు ఓ కారణమైతే… ప్రమాదాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మరో కారణం. కొంత దూరంలో మలుపు ఉందనగా వాహనదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ప్రస్తుతం అటువంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు.
అధిక లోడు వాహనాలే కారణం:
మండలంలో గడిచిన ఏడాది వ్యవధిలో 20 కి పైగా రోడ్డు ప్రమాద కేసులో నమోదయ్యాయి. ఇది అధికారికంగా ఉన్న లెక్కలు… అనధికారికంగా జరిగిన దుర్ఘటనలు, రాజీ పడిన సంఘటనలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్డు మూల మలుపుల వద్ద జరుగుతున్నవే. అతివేగంతోపాటు ఈ మూల మలుపుల వద్ద నిబంధనలు ఉల్లంఘించి, అధిక లోడుతో వెళుతున్న వాహనాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ద్విచక్ర వాహనంపై ముగ్గురేసి ప్రయాణించడం, ఆటోల్లో 12 మందికి పైగా ప్రయాణికులతో నడపడం తరచూ దుర్ఘటనలు జరుగుతున్నాయి.
మృత్యు మార్గాలు:
- జాన్ పహాడ్ నుండి నేరేడుచర్లకు వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- గుడుగుంట్లపాలెం మూలమలుపులో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై పడడంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నేటికి మంచానికి పరిమితమయ్యాడు.
- కల్మట్ తండాలో ఇటీవల మూలమలుపు వద్ద లారీ ఢీకొని ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
- పాలకవీడు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి సంఘటన చోటుచేసుకుంది.
- అదే చోట లారీ ప్రమాదంలో 8 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
- బెట్టేగూడెం – హనుమయ్య గూడెం మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదకరంగా రోడ్ పక్కనే ఉన్న మిషన్ భగీరథ గేట్ వాల్ ను ఢీకొని 20 సం”ల యువకుడు మరణించాడు.
ఇలా మూల మలుపుల్లో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం : ఎస్సై కె.లక్ష్మీ నర్సయ్య
ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పోయాయి. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. నిత్యం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం.
సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఆర్ అండ్ బి. జె ఈ నాయిని.ప్రీతి
ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. రోడ్ల వెంట ఉన్న ముళ్ళ పొదలను తొలగించాం. త్వరలో సూచిక బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
ఇబ్బందులు పడుతున్నాం: దామెర్ల.వేణుగోపాల్ జాన్ పహాడ్
మూలమలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సూచిక బోర్డులతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మూలమలపుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.