- కేసీఆర్ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదు
- మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, ఇతర నాయకులతో కలిసి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ మీద అక్కసుతోనే ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని అందుకే ఆయన విగ్రహం వద్దకు రాలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్న విషయం ముఖ్యమంత్రి గమనంలోకి తీసుకొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలని కేసీఆర్ ప్రభుత్వంలో అడుగులు వేశామన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నగరం నడిబొడ్డున కేసీఆర్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించలేదని, ముఖ్యమంత్రి, మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయకుండా ఆయనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుడు విగ్రహం వద్ద లైట్లు కూడా వేయకుండా చీకట్లో మగ్గేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరును ప్రజాస్వామికవాదులంతా తప్పుబట్టిన తర్వాత ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కేబినెట్ మంత్రులంతా వచ్చి దండవేయడాన్ని హర్షిస్తున్నామని అన్నారు. అదే సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం మొదటి అంతస్తులోకి వెళ్లి నివాళులర్పిస్తామని నాయకులు చెప్పినా పోలీసులు అనుమతించలేదు. మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు తగలడంతో ఎమ్మెల్సీ కవిత సహా నాయకులంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించి జీ భీమ్ నినాదాలు చేశారు. అనంతరం మొదటి అంతుస్తులోకి వెళ్లి నివాళుర్పించేందుకు పోలీసులు అనుమతించారు.
కవితతో బీపీ మండల మనవడి భేటీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఆమెతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బీసీ ఉద్యమంపై ఇద్దరు చర్చించారు. బీసీల కోసం కవిత చేస్తున్న కృషిని సూరజ్ మండల్ కొనియాడారు. కవిత పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన కృషిని అభినందించారు. అనంతరం సూరజ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత జీవేకే ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులను బట్టలు విప్పి కొట్టేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎవరి దన్ను చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారని నిలదీశారు. రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా.. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. దళితులను అవమానించడమే ప్రజా పాలనా అన్నారు. లింగంపేట మండలంలో ఫ్లెక్సీల విషయంలో పోలీసులు దళితుల సాగించిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. దళితులను బట్టలు విప్పి మరి అరెస్టు చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. దళితులపై సాగించిన దమనకాండకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.