- రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం హర్షణీయం
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు భూభారతి పోర్టల్ అవిష్కరణ అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు సీఎంకు జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా వారు తెలగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ తరుపున, తెలంగాణ తహాసీల్దార్స్ అసోసియేషన్ తరుపున, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో దేశంలో ఎక్కడా కూడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టించి, రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులకు బాటలు వేసిన ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరం రుణపడి ఉంటామని చెప్పారు. భూ భారతి చట్టం – 2025 ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షకార్యదర్శులు రాములు, రమేష్ పాక, టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామ్ రెడ్డి, బిక్షం తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.