- గత వైకాపా హయాంలో కాజేశారు
- టిటిడి సభ్యుడు భాను ప్రకావ్ రెడ్డి ఆరోపణ
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని, కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి మొక్కులు చెల్లింపులో భాగంగా భక్తులు వివిధ రూపంలో తులాభారం సమర్పిస్తారని, తులా భారం ద్వారా నిత్యం 10 లక్షల రూపాయలు.. కానుకలను భక్తులు సమర్పిస్తున్నారన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారన్నారు. తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే.. అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తులా భారంలో అక్రమాలపై విజిలేన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ ఎగరడం.. నిఘా వైపళ్యంగా భావిస్తున్నామన్నారు. భద్రతా సిబ్బంది కొరత వుందని.. సిబ్బందిని కూడా పెంచుతామని ఆయన తెలిపారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో మంగళవారం డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. అత్యంత పవిత్రమైన, భద్రతాపరంగా కీలకమైన ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రాజస్థాన్కు చెందిన ఓ యూట్యూబర్ను తిరుమల విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ మంగళవారం దాదాపు పది నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాను వినియోగించినట్లు తెలిసింది. అంతకుముందు, ఉదయం నుంచే ఆ వ్యక్తి తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. డ్రోన్ గగనతలంలో ఎగురుతున్న విషయాన్ని గమనించిన విజిలెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించారు. ప్రస్తుతం యూట్యూబర్ ను విచారిస్తున్నామని, డ్రోన్ కెమెరా మెమరీ కార్డును స్వాధీనం చేసుకొని అందులోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడిరచారు.