- కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి కార్యాలయంతో పాటు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగారు. దీనిపై భాజపా స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రైవేటు ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్కు ఇచ్చే హక్కు లేదని భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబయి, లఖ్నవూ, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారని ఆరోపించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ కు సంబంధించిన 99శాతంషేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుందని ఆరోపించారు.
స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యానని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని.. ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్న దేశమని అన్నారు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం నమోదు చేసింది. సోనియాను మొదటి నిందితురాలి (ఏ-1)గా, రాహుల్ను ఏ-2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీనిని పరిశీలించి, తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శ్యాం పిట్రోడా, సుమన్ దుబె తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది.