- హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
- రాహుల్కు ఇమేజీని తట్టుకోలేకే కుట్ర కేసులు
- మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేశ్ కుమార్
- బిజెపి కుట్రల పార్టీ అన్న వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లో ధర్నా చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, దామోదర రాజనర్సింహా, కొండాసురేఖ, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకిదయాకర్, ఎమ్మెల్యేలు రాజాకూర్, శంకరయ్య, ఎంపీ. అనిల్కుమార్ యాదవ్, ఎఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్కుమార్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీలు.వి.హనుమంర్రావు, అంజన్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు సునీతారావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.. కేంద్ర ప్రభుత్వం, ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన చేస్తోందని టీ-పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా ఆరోపించారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని ధర్నా చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందుకే ధర్నా చేశామని అన్నారు. ఈ ధర్నాలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయిన నేషనల్ హెరాల్డ్ పేపరుకి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనీలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసు కక్ష్య సాధింపు చర్యలేనని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గాంధీ కుటుబం ఏనాడూ కేసులకు భయపడింది లేదని అన్నారు. స్వాతంత్య ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరని చెప్పారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అని అభివర్ణించారు. దేశ ప్రజా గొంతుక రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాహుల్ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అని చెప్పారు.

కుల గణనతో రాహుల్ గాంధీ మోదీకి రాజకీయ మరణ శాసనం రాశారని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ , సోనియా గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే ప్రతి పక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ – అమిత్ షాకి అలవాటుగా మారిందని విమర్శలు చేశారు. గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు అసమనమైనవని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇదిలావుంటే సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు ధర్నా చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీది క్షమించే గుణం.. మోదీ, అమిత్ షాలది కుట్ర గుణమని ఆరోపించారు. బీజేపీనీ అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధాన మంత్రిని ఎందుకు చేయలేదని అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ … మన్మోహన్ సింగ్ను ప్రధాన మంత్రిని చేశారని గుర్తుచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మోదీ, అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. స్వాతంత్య సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పేపరే నేషనల్ హెరాల్డ్ అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు మోదీ, అమిత్ షాలు పుట్టనేలేదన్నారు. స్వాతంత్య ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
