- శ్రీనగర్ నుంచి ప్రత్యేకంగా విమనాల ఏర్పాటు
- 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
ప్రశాంతత చోటుచేసుకున్న కాశ్మీర్లో మరోమారు పర్యాటకులు వీడుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన యాత్రికులు ఇక్కడి నుంచి స్వస్థలాలకు బయలుదేరరు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన తో వణికిపోయిన పర్యాటకులు వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాం. ఆహారం, నీరు అందించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3,337 మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని వీడారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించాం. ఇప్పటికే అన్ని ఎయిర్లైన్లు టికెట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా పర్యటకులకు అండగా నిలవాలని కేంద్రమంత్రి తన పోస్ట్లో పేర్కొన్నారు.
మరోవైపు తాజా పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి స్పందించారు. కశ్మీర్ లోయ నుంచి అతిథులు వీడుతుంటే నా హృదయం ద్రవిస్తోందని అన్నారు. అయితే వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారనేది నేను అర్థం చేసుకోగలను. పర్యాటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కల్పించిన అదనపు విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ ప్రయాణ సౌకర్యాలు కల్పించాం అని సీఎం వెల్లడించారు. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సవిూప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఉగ్రవాద దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అత్యంత దారుణమైన ఈ దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని ప్రజలకు హావిూ ఇస్తున్నాని స్పష్టం చేశారు. డీజీపీతోపాటు భద్రతా అధికారులతో ఈ అంశంపై మాట్లాడానన్నారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తన మరో ఎక్స్ ఖాతా ద్వారా లెప్టినెంట్ జనరల్ఎల్జీ సిన్హా మాట్లాడుతూ.. ఉగ్రవాదులను తటస్థీకరించడానికి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించామన్నారు. యావత్ దేశమంతా కోపంగా ఉందని చెప్పారు. తమ దళాలు రక్తం కారుస్తున్నాయని చెప్పారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారు.. భారీ మూల్యం చెల్లించు కుంటారని తాను దేశానికి హావిూ ఇస్తున్నానని పేర్కొన్నారు.