- ఓటు హక్కు వినియోగించుకున్న 66మంది
- 25న కౌంటింగ్కు ఏర్పాట్లు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77.56 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 66 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలో ఓటు వేయగా.. బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల ఎక్స్ అఫీషియో, కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 112 మంది ఉన్నారు. వీరిలో 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసేందుకు భవన నిర్వహణ విభాగం గదిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్లో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరుగనుంది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తోంది.
అయితే 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్దిగా విూర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 200 విూటర్ల నుంచే రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 22 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ ఎన్నికకు కోసం ఎన్నికల అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు జీహెచ్ఎంసీ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది.