ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ (జూన్ 4న) పొద్దున 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. సీఎం చంద్రబాబు సమావేశమయ్యే క్యాబినెట్లో కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అమరావతిలో నిర్మించనున్న జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనున్నారు. అలాగే హెచ్వోడీ 4 టవర్ల టెండర్లకు సైతం పచ్చజెండా ఊపనున్నారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా సమావేశమవుతున్నారు.
అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులతో చర్చి నిర్ణయం తీసుకుంటారు. అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఓకే చెప్పనున్నారు. 2500 ఎకరాల్లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంపెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ తదితర నిర్మాణాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పలు సంస్థలకు భూకేటాయింపులు జరపనున్నారు.
తల్లికి వందనంతోపాటు కూటమి సర్కార్ తొలి ఏడాది పాలనపై చర్చిస్తారు. ఈ నెల 21న విశాఖలో ‘ఇంటర్నేషనల్ యోగా డే’ని తలపెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడనున్నారు. ఈ నెల 5న (గురువారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడంపై దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మంచినీటి సరఫరాకు సుమారు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ రూ.8.22 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
మంచి ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చనున్నారు. పరిశ్రమల చట్టం 2025, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2025లో నిబంధనల సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం సమ్మతి తెలపనుంది.