- చైనాపై సుంకాల నిర్ణయంలో వెనక్కు తగ్గిన అమెరికా అధ్యక్షుడు
- భారత్పై మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్
- వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు
ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన ట్రంప్, తాజాగా వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసినట్లు అమెరికా వైట్హౌస్ వెల్లడించింది. చైనా కూడా తమ అధికారిక మీడియా ద్వారా ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. తొలుత నిర్ణయించిన 90 రోజుల గడువు మంగళవారం అర్థరాత్రితో ముగియనున్న వేళ, ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా–చైనా మధ్య గతంలో వంద శాతం పైగా సుంకాలు విధించుకున్నప్పటికీ, తర్వాత వాటిని రద్దు చేసి ప్రస్తుతం చైనా దిగుమతులపై 30 శాతం సుంకం మాత్రమే అమలులో ఉంది. భారత్పై అమెరికా ప్రస్తుతం 25 శాతం సుంకం వసూలు చేస్తోంది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ఈ నెల 27 నుంచి మరిన్ని 25 శాతం సుంకాలు అమలు చేయడానికి సిద్ధమైంది. దీంతో భారత్పై మొత్తం సుంక భారం 50 శాతానికి చేరనుంది. ఇదే పరిస్థితిలో ఉన్న చైనాపై మాత్రం ట్రంప్ సడలింపు ఇవ్వడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ, “చైనాతో సుంకాల సమస్య కొంత సంక్లిష్టంగా ఉంది. రష్యా చమురు కొనుగోలు ఒక కారణమే అయినప్పటికీ, ఇరుదేశాల మధ్య అనేక వ్యూహాత్మక అంశాలు సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.