పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ అమెరికా పర్యటన జరుగుతున్న వేళ, వాషింగ్టన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్థాన్లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)తో పాటు, దాని ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ను కూడా అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019లోనే బీఎల్ఏను ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చిన అమెరికా, తాజాగా మజీద్ బ్రిగేడ్ కూడా అదే సంస్థలో భాగమని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.
మజీద్ బ్రిగేడ్ గత కొన్నేళ్లుగా పాక్ సైన్యంపై వరుస దాడులు జరుపుతోంది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై దాడులు, 2025లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి 300 మందిని బందీలుగా ఉంచిన ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ రైలు హైజాక్లో 31 మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడుల నేపథ్యంలో బీఎల్ఏపై అంతర్జాతీయ ఉగ్రవాద ముద్ర వేసేందుకు పలు దేశాలను కోరుతూ వచ్చింది.
ఇక, ఇటీవల భారత్పై అధిక టారిఫ్ల కారణంగా వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో, పాక్తో అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగా, అసిం మునీర్ రెండు నెలల్లో రెండోసారి అమెరికా పర్యటన చేపట్టడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ పర్యటన మధ్యలోనే బీఎల్ఏపై ఉగ్రవాద ముద్ర వేసిన నిర్ణయాన్ని అంతర్జాతీయ మీడియా, “మునీర్కు ట్రంప్ అందించిన ప్రత్యేక రాజకీయ బహుమతి”గా అభివర్ణిస్తోంది.