అందరూ లొంగిపోవాలని అమిత్ షా పిలుపు
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలతో సహా 22 మంది సీనియర్ పోలీసులు అధికారులు, సీఆర్పీఎఫ్ ముందు లొంగిపోయారు. ఆ తర్వాత మరో 11 మంది పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నారు. మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు- రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులను అందచేస్తామన్నారు. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ సాధ్యమైనంత త్వరగా లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా శుక్రవారం నాడు మరోసారి పిలుపునిచ్చారు. 2026 మార్చి 31 కల్లా నక్సల్స్ బెడద నుంచి దేశానికి విముక్తి కలిగించాలనే కృతనిశ్చయంతో కేంద్రం ఉందని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులను కోబ్రా కమెండోలు, ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారని, వారి నుంచి అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అమిత్షా తెలిపారు. 11 మంది మావోయిస్టులు కూడా సుక్మా జిల్లా బడేసేటీ- పంచాయతీలో లొంగిపోయారని, దీంతో నక్సల్స్ బెడద నుంచి ఆ పంచాయతీకి విముక్తి లభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.