మేడ్చల్, 13 ఆగస్టు 2025:
మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను పోలీసు విధులలో వినియోగించడం” పై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు ను విజయవంతంగా నిర్వహించామని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పి.మధుకర్ స్వామి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు, శిక్షణలో భాగంగా నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నేర నియంత్రణ, భద్రతా వ్యవస్థల బలోపేతం, డిజిటల్ ఫోరెన్సిక్ పద్ధతులు, మరియు ఇంటెలిజెంట్ సర్వైలెన్స్ సిస్టమ్ల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పోలీస్ సిబ్బంది సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని, ప్రజా భద్రతను మరింత సమర్థవంతంగా కాపాడడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
డ్రోన్ టెక్నాలజీ వినియోగం వల్ల ట్రాఫిక్ జామ్ లను గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులు కదలికలను గుర్తించడం, ప్రజలు ఎక్కువగా గుమి కూడిన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాల్లో సహాయకారిగా ఉంటుంది.
అలాగే పోలీసు వారి రోజువారి విధులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల సైబర్ నేరాలను అరికట్టడం మరియు నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం వంటి వాటిలో సహాయకారిగా ఉంటుంది అలాగే సైబర్ సెక్యూరిటీ లో శిక్షణ పొందడం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు వివిధ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు కె.అఖిలేష్ రావు మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో నిపుణులైన నిఖిల్ గుండా మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ – హ్యాండ్ రైటింగ్ నిపుణుడు మల్లికార్జున రావు ఇంకా పోలీస్ ట్రైనింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కెవి విజయ్ కుమార్ డీఎస్సీ, మరియు ఇన్స్పెక్టర్లు కె ఎస్ రవి కుమార్, చంద్రశేఖర్, రాంబాబు, కిరణ్ కుమార్, మంజుల మరియు కళాశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.