- దశాబ్దాల పాటు ఐజేయూలో పని చేసిన నేతలను గుర్తుపట్టని స్థితిలో అధ్యక్ష, కార్యదర్శులు
- జిల్లా అధ్యక్షుడిగానైనా సంఘం ఆఫీసులో పరిచయం చేశారా?
- ఒకసారి గత కమిటీలో పనిచేసిన నేతల వివరాలు తెలుసుకోవాలని సూచన
- టీయూడబ్ల్యూజే (ఐజేయు)కి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా నేతలు రఘుపతి, గణేష్
జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టు సంఘాల పట్ల కనీసం అవగాహన లేని వ్యక్తులు టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా చెలమణి అవుతూ… జర్నలిస్టు సంఘాల పట్ల ఆనాలోచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీయూడబ్ల్యూజే (ఐజేయు) కి ఇటీవల రాజీనామ చేసిన సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ లు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తామేనని చెప్పుకుంటున్న వ్యక్తులు తమపై చేసిన వాఖ్యల ద్వారా జర్నలిస్టు సంఘాలతో వారికున్న సంబంధాలు యేపాటివో స్పష్టమైందని అన్నారు. జిల్లా అధ్యక్ష స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒకసారి గత కమిటీ నాయకుల వివరాలను ఇప్పటికైనా సంఘం కార్యాలయం నుంచి తెప్పించుకొని చూసుకోవాలని గుర్తు చేశారు. పెద్దల మెప్పుతో పదవులు పొందిన వారికి సంఘంలోని సభ్యులు, కమిటీలో పనిచేసిన వారు ఎలా తెలుస్తారని విమర్శించారు. వ్యవస్థగా నడవాల్సిన సంఘం ఒకరిద్దరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందనే ఆవేదనతోనే జర్నలిస్టులంతా ఆ సంఘానికి దూరమవుతున్నారని, భవిష్యత్తులో ఇంకా చాలామంది దూరమయ్యేది ఉందని పేర్కొన్నారు. ఎలాగోలా అధ్యక్ష పదవిలోకి వచ్చి నెలరోజులు పూర్తి చేసుకున్న మిమ్మల్ని ఇప్పటికైనా యూనియన్ ఆఫీసు మెట్లు ఎక్కనించారా..? ఒకసారి చెక్ చేసుకోవాలని హితువు పలికారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో నిన్ను యూనియన్ కార్యాలయంలోకి గనుక రానిస్తే… ఒకసారి రంగారెడ్డి జిల్లా పాత కమిటీల నియామకం, జిల్లాలోని మండలాల కమిటీల ఎంపిక తీరు, అందులోని సభ్యుల వివరాలు, ఇటీవల సంఘాన్ని వదిలిన వారు యూనియన్ పిలుపుమేరకు చేసిన పోరాటాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు సూచించారు. మేమంతా రోడ్లపై ధర్నాలు చేసేటప్పుడు మీరెక్కడున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అంతా మీకే అర్ధమవుతుందని హితువు పలికారు. మాపై మీరు చేసిన వ్యాఖ్యల ద్వారా సంఘంపైన, జర్నలిస్టుల సమస్యలపైన అవగాహన లేనిది ఎవరికో జర్నలిస్టు లోకానికి అర్ధమవుతుందని వారు పేర్కొన్నారు.