- 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కు అనుమతి
- ఆరు జట్లు పాల్గొనే అవకాశం
- జట్ల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం
లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్కు చోటు లభించింది. తాజాగా ఈ ఒలింపిక్స్ లో క్రికెట్ కు సంబంధించిన మరో కొత్త విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఈ లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు చొప్పున పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున మొత్తం 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. టీ20 ర్యాంకింగ్స్ లో ఉన్న టాప్-6 జట్లే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. అయితే అమెరికా హోస్ట్గా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో వారికి మాత్రం నేరుగా ప్రవేశం దక్కే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీని బట్టి, మిగతా ఐదు స్థానాలకు మాత్రం ర్యాంకింగ్స్ లో జట్టు పోటీ పడాలి. ప్రస్తుతం పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ టాప్ 5లో ఉన్నాయి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముందున్నాయి. కానీ 2028 ఒలింపిక్స్ ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కాబట్టి, ఈ ర్యాంకింగ్స్లో మార్పులు జరగొచ్చు. ఒలింపిక్స్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు ఆడితే, అది క్రికెట్ అభిమానులకు అసలైన మజానిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, వారు టాప్ 5లో చోటు సంపాదించుకోవడం కోసం గట్టిగానే పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. కాగా, చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్ లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మనం పైన చెప్పుకున్న జట్ల ఎంపిక అనేది కేవలం అంచనా మాత్రమే. 2028 ఒలింపిక్స్ నిర్వహించే నాటికి టీ20 ర్యాంకింగ్స్లో మార్పులు వస్తే జట్ల ఎంపికలో కూడా మళ్లీ మార్పులు రావచ్చు. కాబట్టి ఇవే ఫైనల్ అనేది స్పష్టం చేయలేము. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలిపింక్స్లో మళ్లీ క్రికెట్ను నిర్వహించబోతున్నారు. 1900 ఒలింపిక్స్లో తొలిసారిగా క్రికెట్ను నిర్వహించారు. ఈ పోటీల్లో బ్రిటన్, ఫ్రాన్స్ రెండు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇందులో 158 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన బ్రిటన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఫ్రాన్స్ కాంస్యం అందుకుంది. ఆ తర్వాత కొన్ని అనివార్యకారణాలతో క్రికెట్ను ఒలింపిక్స్ పోటీల నుంచి తప్పించారు.