- జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు
- మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
- చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు
- డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట
- కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం
- నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు
- జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త
- సొంత డిపార్ట్ మెంట్ కు ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు
- సనావుద్దీన్ అవినీతిపై హైకోర్టులో పిటిషన్ వేసిన అబ్దుల్ రెహమాన్
- ఈఈ అవినీతి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్
ప్రభుత్వంలో ఏ శాఖలో చూసిన అవినీతి రాజ్యమేలుతుంది. చప్రాసీ మొదలు ఐపీఎస్ ల వరకు ఎవరైనా డబ్బు ఇవ్వనిదే పనిచేసి పెట్టరు. ఏ డిపార్ట్ మెంట్ లో అవినీతి లేనిదే లేదు. ఉద్యోగస్థులు లక్షల్లో జీతాలు తీసుకుంటూనే అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కు పట్టుబడుతున్న వెనక్కి తగ్గట్లేదు. ‘ఎలుక తోలు తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్నట్టు ఉన్నది. డబ్బులు వసూల్ చేస్తూ జనాన్ని పట్టి పీడిస్తున్నారు. మరికొందరేమో కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. ఉన్నతాధికారులైతే పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని ఈజీగా అక్కడ్నుంచి వేరే జాగకు ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఓ అవినీతి జలగ ఆగడాలు బయటపడుతున్నాయి. షేక్ సనావుద్దీన్ అనతికాలంలోనే కోట్లల్లో వెనకేసుకున్నాడు. అవినీతికి పాల్పడ్డ ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేసేందుకు జంకుతున్నారు. మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కాగా జీహెచ్ఎంసీలో పెత్తనం చలాయిస్తున్నాడు. ‘అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు’ అవినీతి అధికారుల తీరు ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా షేక్ సనావుద్దీన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. వాస్తవానికి మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. ఈ సంస్థలో నిధులు లేక ఎలాంటి మాముళ్లు అందక పోవడంతో చంద్రాయాణగుట్ట సర్కిల్ 8కు డిప్యూటేషన్ పై వచ్చారు. గత 15 సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నాడు. కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీలో సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూ డ్రైన్, బాక్స్ డ్రైన్, గ్రేవియాడ్ పనుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డాడు. కమ్యూనిటీ హాల్, అత్యవసర విపత్తు పనుల్లో కూడా వందల కోట్లు విలువ గల పనులు చేశారు. జీహెచ్ఎంసీలో 35శాతం లెస్ లో టెండర్ కొటేషన్ వేసిన ఎల్1, ఎల్2, ఎల్3 ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు పనులు కేటాయించకుండా, ఇతర కారణాల చేత ఉద్దేశ పూర్వకంగా టెండర్లను రద్దు చేసి, ఆయనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లతోని లోపాయికారి ఒప్పందాలు చేసుకొని 1శాతం లెస్తో టెండర్లను అప్పగించేవారని ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకుంటూ… కోట్ల అవినీతి సంపాదన చేశారు. నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాకు కోట్ల మేర నష్టం వాటిళ్లుతుంది. షేక్ సనావుద్దీన్ అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. సనావుద్దీనకి అప్పటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జీయావుద్దీన్ కూడా వత్తాసు పలికినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకున్నా, అవినీతి డబ్బుతో కోట్లకు పడగలెత్తిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు ఎంత అవినీతి చేసినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఈఈ షేక్ సనావుద్దీన్ చేసిన అవినీతిపై సామాజికవేత్త అబ్దుల్ రెహమాన్ జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాతృ శాఖను వదలి వచ్చి ఏళ్లుగా తిష్టవేసి కోట్లకు కోట్లు వెనకేసుకున్న సనావుద్దీన్ పై అధికారులు సొంత డిపార్ట్ మెంట్ కు ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అవినీతి, అక్రమాలపై సామాజికవేత్త అబ్దుల్ రెహమాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈఈ సనావుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని, పూర్తిగా ఉద్యోగంలో రిమూవల్ చేయాలని కోరుతున్నారు. ఆయన అవినీతి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈఈ సనావుద్దీన్ చేసిని అవినీతి అక్రమాలు పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..